Viral News in Telugu: కాలేజ్‌లలో సీనియర్లు జూనియర్లను ఆటపట్టించడం సహజమే. హద్దు దాటనంత వరకూ అది బానే ఉంటుంది. మితిమీరితేనే ఇబ్బందులు తప్పవు. బెంగళూరులోని ఓ కాలేజ్‌లో ఇదే జరిగింది. గడ్డం, మీసం తీసేందుకు జూనియర్ ఒప్పుకోలేదని సీనియర్లంతా కలిసి వేధించారు. దాడి చేశారు. ఆగస్టు 30వ తేదీన ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఏడాది ఏప్రిల్‌లో గౌతమ్‌ కాలేజీలో చేరాడు. అప్పటి నుంచే సీనియర్లు వేధించడం మొదలు పెట్టారు. గడ్డం,మీసం ఎందుకు పెంచుతున్నావని నిలదీశారు. తీసేయాలని బెదిరించారు. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడం వల్ల అంతా కలిసి టార్గెట్ చేశారు. ఓ చర్చ్‌కి తీసుకెళ్లి అటాక్ చేశారు. ఈ దాడిలో బాధితుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్‌కి వెళ్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 


అయితే...హాస్పిటల్‌లో కూడా తమను బెదిరించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లెయింట్ ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై బాధితుడి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. కాలేజీలలో ర్యాగింగ్‌పై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా..ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య కాలేజీలోనే ఓ యువతిని వేధించి తోటి విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ ఘటన సంచలనమైంది. కాలేజీలలో వేధింపులు, ర్యాగింగ్‌ని అరికట్టేందుకు ప్రత్యేకంగా కమిటీలు వేస్తున్నా సరైన నిఘా ఉండట్లేదన్న ఆరోపణలున్నాయి. 


Also Read: World Richest Cat: ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి, సోషల్ మీడియాలో ఒక్క పోస్టుకు సంపాదన ఎంతంటే!