ఎటు చూసినా విపరీతమైన ట్రాఫిక్, కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి బుధవారం బెంగళూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనం ఒక ఇంచు కదలాలన్నా ఎంతో సమయం పట్టింది. ఎంతో మంది ప్రజలు కార్లలోనే గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షిస్తూ ట్రాఫిక్‌ జామ్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. కావేరీ జలాల వివాదంతో ముందు రోజు జరిగిన బంద్‌ ప్రభావంతో బెంగుళూరులో నిన్న భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక సిటీలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. దాదాపు ఐదు గంటలకు పైగా వాహనాలు ఓఆర్‌ఆర్‌పై నిలిచిపోవడంతో వాహనాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. 


ఇదిలా ఉండగా, ఇంత ట్రాఫిక్‌ జామ్‌లో కూడా ఇద్దరు పిజ్జా డెలివరీ బాయ్స్‌ లైవ్‌ లొకేషన్‌ సహాయంతో సమయానికి పిజ్జా డెలివరీ చేశారు. అది కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కార్‌లోకి వారి పిజ్జాను అందించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. డామినోస్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ లైవ్‌ లొకేషన్‌ సహాయంతో ట్రాక్‌ చేస్తూ ట్రాఫిక్‌లో బైక్‌ పై వచ్చి కారు ముందు బైకి ఆపి సమయానికి వారి పిజ్జాను వారికి ఇచ్చారు. 


డామినోస్‌ నుంచి పిజ్జా తెప్పించుకున్న వినియోగదారుడు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు. 'బెంగుళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉండగా డామినోస్ నుంచి ఆర్డర్‌ చేయాలని అనుకున్నాం. అప్పుడు వారు ఎంతో దయతో లైవ్‌ లొకేషన్‌ ట్రాక్‌ చేస్తూ ట్రాఫిక్‌ జామ్‌లో కూడా డెలివరీ ఇచ్చారు' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోను ఎక్స్‌లో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మందికి పైగా చూశారు. అంతేకాకుండా ఎన్నో కామెంట్స్‌ కూడా వచ్చాయి.


ముఫ్పై నిమిషాల డెలివరీ టైమ్‌ ప్రామిస్‌ను డామినోస్‌ నెరవేర్చడం అద్భుతం అంటూ ఓ యూజర్‌ ట్వీట్‌ చేశారు. ఇంత ఎక్కువ ట్రాఫిక్‌లో లైవ్‌ లొకేషన్‌ నావిగేట్‌ చేస్తూ కస్టమర్‌ను చేరుకోవడం చాలా ఛాలెంజ్‌తో కూడుకున్నదని, అయినప్పటికీ వారు చేరుకున్నారని మరొకరు పేర్కొన్నారు. ఇంకొకరు అర్బన్‌ కంపెనీలో మసాజ్‌ బుక్‌ చేస్తానని ట్వీట్‌ చేశారు. చాలా మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ మెచ్చుకుంటూ రకరకాల కామెంట్స్‌ చేశారు. 


బెంగుళూరు నగరంలో బుధవారం ట్రాఫిక్‌ జామ్‌ సాధారణం కంటే రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో దాదాపు 3.5 లక్షల వాహనాలు రోడ్లపై ఉన్నట్లు అంచనా. సాధారణంగా అయితే 1.5లక్షల నుంచి 2 లక్షల వాహనాలు రోడ్లపై ఉంటాయి. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ అక్కడి ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ మద్దతుతో బంద్‌కు పిలుపునిచ్చాయి. కన్నడ సంఘాలు, రైతు సంస్థలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి.  ఈ నేపథ్యంలో నగరంలో బుధవారం భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కొన్నివాహనాలు బ్రేక్‌డౌన్‌ అవ్వడంతో ట్రాఫిక్‌ సమస్య మరింతగా పెరిగిపోయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. పరిస్థితి చేజారుతున్నట్లు తెలియగానే రాత్రి 9 గంటల వరకు ఎవ్వరినీ ఆఫీసుల నుంచి బయటకు రావద్దొని అధికారులు ప్రకటించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.