Srikakulam News: ఎన్నెన్నో ఆశలతో వారు వివాహ బంధదలోకి అడుగుపెట్టారు. ఏడుడుగులు, మూడు ముళ్లతో జన్మజన్మాల పాటు కలిసుండాలని కలలు కన్నారు. బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని తెగ మురిసిపోయారు. ఆ మధుర క్షణాలను మదిలో దాచుకొని కొత్త జీవతాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. కష్టసుఖాలను పంచుకుంటూ.. పిల్లాపాపలతో కలకాలం సుఖంగా ఉండాలనుకోగా.. కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన ఆ జంట అనంతలోకాలకు వెళ్లిపోయారు. విషయం తెలుకుసున్న బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి అత్తారింటికి ఒడిశా రాష్ట్రానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నవ దంపతులను సోమవారం సాయంత్రం ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవ వధూవరులిద్దరూ మృతి చెందారు. ఈ ఘోర ఘటన ఇరు కుటుంబాలు, స్నేహితులు, ఆత్మీయులందరినీ కంటతడి పెట్టించింది. ఇచ్ఛాపురంలో పట్టణంలోని బెల్లుపడ కాలనీలో ఉంటున్న 21 ఏళ్ల వేణు అలియాస్ సింహాచలం ఓ బట్టల షాపులో పని చేస్తున్నాడు. ఇతనికి బెర్హంపూర్‌కు చెందిన 18 ఏళ్ల సుభద్ర అలియాస్ ప్రవల్లికతో వివాహం జరిగింది. సింహాచలం క్షేత్రంలో ఈనెల 10వ తేదీన జరిగిన వేడుకల్లో బంధువులు, స్నేహితులు అంతా పాల్గొన్నారు. అమ్మాయి తరఫు వాళ్లు ఈనెల 12వ తేదీ ఆదివారం రోజున ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి దంపతులను ఆశీర్వదించగా... అత్తారింటికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయిని ద్విచక్రవాహనంపై అత్తారింటికి పంపారు. 


నవదంపతులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి


ఎన్నెన్నో ఊసులాడుకుంటూ కొత్త జంట బైకుపై అత్తారింటికి బయలు దేరింది. అయితే గొళంత్రా పోలీస్ ఠాణా పరిధిలో ఓ ట్రాక్టర్ వీరి బండిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధూవరూలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సుభద్ర అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్ర గాయాలైన వేణును బెర్హంపూర్‌ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి, అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వేణు తండ్రి రామారావు గతంలోనే చనిపోయారు. అన్నయ్య, అక్క, అమ్మతో కలిసి ఉంటున్నారు. అన్యాయం చేసి వెళ్లిపోయాడంటూ బోరున విలపిస్తున్నారు. నిన్నటి వరకూ పెళ్లి వేడుకతో సందడిగా ఉన్న ఇళ్లు.. నేడు ఏడుపులు, పెడబెబ్బలతో విలవిల్లాడుతున్నాయి. పందిరి, కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఇలా జరగడంతో ఇరు గ్రామాల్లోనూ విషాధ ఛాయలు అలముకున్నాయి. 


పది రోజుల క్రితం ఇదే జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి


శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఉపాధి హామీ కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. బ్రేక్ ఫెయిల్ అయి లారీ వేగంగా కూలీలపైకి దూసుకెళ్లింది. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి  తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  ఈ ప్రమాదం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురు కూలీలు మందాడ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాద ఘటనతో మందాడ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. నిర్లక్ష్యంగా లారీ నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అతి వేగంగా వచ్చిన లారీ రెప్పపాటులో కూలీలపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.