Kuno National Park: 


ప్రమాదాన్ని పసిగట్టేలా..


నమీబియా నుంచి ఇటీవలే 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి  వీటిని వదిలారు. ఇప్పుడు వీటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేటగాళ్ల నుంచి వీటికి రక్షణ కల్పించేందుకు...ప్రత్యేక శిక్షణ తీసుకున్న జర్మన్ షెపర్డ్స్‌ కుక్కల్ని కాపలాగా ఉంచనున్నారు. ప్రస్తుతం వీటికి ఇండో టిబెటన్ బార్డర్ వద్ద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కునో నేషనల్ పార్క్‌లో...చీతాలున్న చోట ఇవి కాపలా కాస్తాయి. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. పులి చర్మం, ఎముకలతో పాటు ఏనుగు తొండాన్నీ గుర్తించే విధంగా వాటికి శిక్షణ ఇస్తున్నారు. WWWF-India (World Wide Fund for Nature India) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. ITBPలోని బేసిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ శునకాలను ట్రైన్ చేస్తున్నారు. దాదాపు 7 నెలల శిక్షణ తరవాత ఇవి కాపలాకు సిద్ధమవుతాయి. పసిగట్టడం, ట్రాక్ చేయటం లాంటి నైపుణ్యాల్లో అవి ఆరితేరాకే క్షేత్రస్థాయిలోకి పంపుతారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటి డ్యూటీ మొదలవుతుంది. 






దశాబ్దాల తరవాత ఇండియాకు..


దాదాపు 7 దశాబ్దాల తరవాత చీతాలు భారత్‌కు తిరిగి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వాటిని అధికారికంగా వదిలారు. వాటిని సంరక్షించి అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మొదటి విజయం. రీఇంట్రడక్షన్ ఆఫ్ యానిమల్స్ (Reintroduction of Animals)లో భాగంగా భారత్‌ ఇలా చీతాలను నమీబియా నుంచి తెప్పించింది. 
1930ల్లో చీతాలను వేటాడటం ఓ స్టేటస్ సింబల్‌గా భావించేవారు. అందుకే...లేదంటే వాటిని పెంచుకుని వాటితో వేరే జంతువులను వేటాడించేవారు. మనం కుక్కల్ని పెంచుకున్నట్టుగా... అప్పట్లో చీతాలను పెంచుకునే వారు. నిజానికి...చీతాలకు, మనుషులకు మధ్య కాన్‌ఫ్లిక్ట్ చాలా తక్కువగా ఉండేదట. చాలా మంది వాటిని "Hunting leopards" గా పిలిచేవారు. వేట కోసం వీటిని ఎక్కువగా వినియోగించేవారు. చీతాలు మాత్రమే కాదు. కాస్త ప్రత్యేకం అనిపించే జంతువులన్నింటినీ అప్పటి రాజులు, బ్రిటీషర్లు వేటాడేవారు. అదిగో అలా మొదలైన వేట..క్రమంగా చీతాల సంఖ్యపై ప్రభావం చూపింది. అవి కనుమరుగవుతూ వచ్చాయి. 1939నుంచి ఇది మరీ ఎక్కువైంది. 1972లో Wildlife Protection Act వచ్చేంత వరకూ ఈ వేట అలాగే సాగింది. అంటే...దాదాపు 40 ఏళ్లపాటు వాటిని వేటాడారు. 


సందర్శనకు ఇంకా టైమ్ ఉంది..


ఇలా అంతరించిపోయిన చీతాలను తిరిగి భారత్‌లోకి ప్రవేశపెట్టి వాటిని సంరక్షించుకుని..జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది కేంద్రం. అందుకే...ప్రాజెక్ట్ చీతాలో భాగంగా వాటిని నమీబియా నుంచి  తెప్పించింది. ఎన్నో దశాబ్దాల సంప్రదింపుల తరవాత ఇన్నాళ్లకు 8 చీతాలు భారత భూభాగంపై అడుగు పెట్టాయి. ప్రస్తుతానికి వాటిని ఎన్‌క్లోజర్స్‌లో ఉంచారు. ఇక్కడి వాతావరణానికి అవి అలవాటు పడేంత వరకూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. అయితే..వీటి సందర్శనకు మాత్రం ఇప్పట్లో ప్రజలకు అనుమతి లభించేలా లేదు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయం చెప్పారు. కొన్ని నెలల తరవాత వీటిని సందర్శించేందుకు అవకాశముంటుందని, అప్పటి వరకూ ఎదురు చూడాలని సూచించారు.