Hathras Stampede Death: యూపీలోని హత్రాస్‌లో తొక్కిసలాట (UP Stampede) జరిగిన ప్రాంతంలో ఆ విషాదం తాలూకు గుర్తులు గుండెని మెలి పెడుతున్నాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇలా ఎంతో మంది నిస్సహాయ స్థితిలో నిలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ బాధితుల చెప్పులు కనిపించాయి. చిన్నారుల చెప్పులతో పాటు వృద్ధుల పాదరక్షలూ అక్కడ కనిపించాయి. తొక్కిసలాటలో అటూ ఇటూ పరిగెత్తడం వల్ల ఈ చెప్పులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఈ దృశ్యాలు ఎంతో ఆవేదన కలిగిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేయనున్నారు. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇంత ప్రాణనష్టానికి కారణమైన నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని తేల్చి చెబుతోంది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. 








హత్రాస్ ఘటనలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. హత్రాస్‌లోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్‌లో వీరందరికీ చికిత్స జరుగుతోంది. వీరందరితోనూ ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు అధికారులతో సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై ఆరా తీశారు.






ఇప్పటికే ఈ ఘటనపై ఓ ప్రకటన చేశారు యోగి ఆదిత్యనాథ్. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోందని వెల్లడించారు. అయితే...ఎవరైనా కుట్ర చేశారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతామని యోగి చెప్పడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. 


"ఈ ఘటనపై మా ప్రభుత్వం పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఇంత విషాదానికి కారణమైన వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతోంది. ఇది ప్రమాదావశాత్తు జరిగిందేనా లేదంటే దీని వెనకాల ఎవరి కుట్రైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది"


- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి


Also Read: PM Modi: రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్, చర్చించే దమ్ములేక పారిపోయారంటూ మోదీ చురకలు