22nd August 2024 School News Headlines Today: 

నేటి ప్రత్యేకత


  • ప్రపంచ జానపద దినోత్సవం 

  • మద్రాసు దినోత్సవం 

  • అల్లూరి సీతారామరాజు మన్యం విప్లవాన్ని ప్రారంభించారు.

  • హీరో పద్మ విభూషణ్ చిరంజీవి  పుట్టినరోజు 


 

ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 

 


  • ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదానికి రియాక్టర్‌ పేలుడు కారణం కాదని ప్రాథమికంగా నిర్దారించారు. రియాక్టర్‌లో తయారైన మిథైల్‌ టెర్ట్‌- బ్యుటైల్‌ ఈథర్‌ రసాయనం లీకవ్వడం వల్లే పేలుడు సంభవించిందని గుర్తించారు. ఈ మిశ్రమం లీకై... వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారి పేలుడు జరిగిందని తెలిపారు.

  • ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా వేసినట్టు తెలిపింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. 


తెలంగాణ వార్తలు:


  • తెలంగాణలో గురుకుల పీఈటీ పోస్టుల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 594 పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 

  • పాత మొబైల్ ఫోన్లు అమ్ముతున్న వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పాడైన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి.. లేదా ప్లాస్టిక్ సామాన్ ఇచ్చి ఫోన్లు కొంటున్నారు. తర్వాత ఆ ఫోన్లతో  సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాత ఫోన్లు కొంటున్న ముఠాను పట్టుకుని.. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గుర్తించారు. 


జాతీయ వార్తలు : 


  • 14 ఏళ్ల తర్వాత భారతదేశంలో పోలియో కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారిలో పోలియో లక్షణాలు కనిపించాయి. ఈ చిన్నారి అస్సాంలోని గోల్‌పరా జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

  • గుజరాత్‌లో చండీపురా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ తొలి కేసు ఈ ఏడాది జులైలో నమోదైనప్పటి నుంచి 14 ఏళ్లలోపు 28 మంది చిన్నారుల ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర శాసనసభలో ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ చెప్పారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్  మరొకొన్ని వైరస్‌లను గుర్తించేందుకు పరిశోధనలు చేస్తోందని తెలిపారు.

  • భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్‌లోని వార్సా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధినేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోదీ రెండు రోజులపాటు పోలాండ్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. కాగా గత 45 ఏళ్లలో పోలాండ్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.


అంతర్జాతీయ వార్తలు: 


  • పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా వర్షం కురిపించింది. హిజ్బుల్లా 50 రాకెట్లను ప్రయోగించినట్లు.. దీంతో ప్రైవేటు ఇళ్లు ధ్వంసం అయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన ఒక వ్యక్తి మరణించగా.. మరో 19 మంది గాయపడ్డారు. 


మంచి మాట: 

 

విజయమే అంతం కాదు.. ఓటమే తుది మెట్టు కాదు..స్వామి వివేకానంద