ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యాగాల్లో స్థానికులకు  75% రిజర్వేషన్ కల్పించాలని హరియాణా సర్కార్ ఇటీవల చట్టం చేసింది. దీనిపై హైకోర్టు స్టే విధించింది.


అయితే ఈ ఆదేశాలు జారీ చేయడానికి కారణాలను హైకోర్టు తెలియజేయకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. 










తీర్పు సవాల్


స్థానికులకు ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో 75% కోటా కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హరియాణా సర్కార్ ఫిబ్రవరి 4న సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. 


హరియాణా సర్కార్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన చట్టంపై కేవలం 90 సెకన్ల పాటు వాదనలు విని హైకోర్టు స్టే విధించిందని తుషార్ వివరించారు. ఫిబ్రవరి 3న హరియాణా హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.


హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రతిభకు, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రైవేటు యాజమాన్యాలు వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టం కేవలం భౌగోళిక వర్గీకరణను మాత్రమే ప్రస్తావిస్తోందని, దీనికి రాజ్యాంగం అనుమతిస్తోందని చెప్పింది.


రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కు, ఆరోగ్య, హక్కు, జీవన ప్రమాణాలు, ఉపాధి పొందే హక్కులను కాపాడటానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వాదించింది. 


హరియాణా రాష్ట్ర స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం, 2020 ప్రకారం నెలకు రూ.30,000 కన్నా తక్కువ వేతనం చెల్లించే  ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలి. ఈ చట్టం జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. 


Also Read: Infosys Recruitment: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్, ఈ ఏడాది 55 వేల మందికి ఉద్యోగాలు