Bilkis Bano Case:


రెండు పిటిషన్‌లు బుట్టదాఖలు..


తనపై అత్యాచారం చేసిన 11 మంది దోషులను గుజరాత్ హైకోర్టు విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఆమె వేసిన రెండు పిటిషన్‌లను తోసిపుచ్చింది ధర్మాసనం. 1992లో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన విధానం ప్రకారం..."సత్ర్పవర్తన" కింద దోషులను విడుదల చేసినట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. కానీ...కొత్త నిబంధనల ప్రకారం..సామూహిక అత్యాచారం, హత్యా నేరాలకు పాల్పడిన నిందితులకు "ముందస్తు విడుదల" వర్తించదు. కానీ...సుప్రీం కోర్టు మాత్రం గుజరాత్ ప్రభుత్వం చెప్పిన పాతరూల్ ప్రకారమే...దోషులను విడుదల చేసేందుకు అంగీకరించింది. దీనిపైనే దేశవ్యాప్తంగా అసహనం వ్యక్తమవుతోంది. 1992లో రూపొందించిన నిబంధనలు...నిందితులకు శిక్ష పడిన 2008 సంవత్సరం వరకూ అమల్లోనే ఉన్నాయి. కానీ...వాటిని పక్కన పెట్టి అలా ఎలా విడుదల చేశారంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. 






న్యాయపోరాటం..


11 మంది దోషులను సత్ర్పవర్తన కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టు గడప తొక్కారు బిల్కిస్ బానో. గుజరాత్ ప్రభుత్వం చెప్పిన 1992 నాటి రెమిషన్ పాలసీని అనుసరిస్తూ సుప్రీం కోర్టు వారి విడుదలను అంగీకరిస్తూ ఇచ్చిన తీర్పుని సవాలు చేశారు. దీనిపై రిట్ పిటిషన్ వేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ ముందు దీని గురించి ప్రస్తావన రాగా.."ఈ విషయాన్ని విచారిస్తాం" అని చెప్పారు. ఇరు పక్షాల పిటిషన్‌లను  ఒకేసారి విచారించొచ్చా లేదా అనేది పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న  జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి నుంచి గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంత దారుణానికి ఒడిగట్టిన వారిని అంత సులభంగా ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. 
బిల్కిస్ బానో కూడా ఈ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారు. అయితే...వీరిని విడుదల చేసే సమయంలో గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 1992 జులై 9న పాస్ చేసిన రెమిషన్ పాలసీ ఆధారంగా చూపిస్తూ...ఈ నిర్ణయం సరైందేనని తేల్చి చెప్పింది. "జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లను సత్ప్రవర్తన కింద 14 ఏళ్ల జైలు శిక్ష తరవాత విడుదల చేసేందుకు అవకాశముంది" అని వివరణ కూడా ఇచ్చుకుంటోంది.  బిల్కిస్ బానో కేసుని విచారించేందుకు కొత్త ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇటీవలే అసహనం వ్యక్తం చేసింది. బిల్కిస్ బానో తరపున న్యాయవాది శోభా గుప్తా ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహను కోరారు. ఈ సమయంలో అసహనానికి గురైన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ "ఆ రిట్ పిటిషన్‌ను పరిశీలిస్తాం. మీరు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పకండి" అని వారించారు. ఇప్పుడు మొత్తంగా ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. 


Also Read: మోడీ-షా ద్వయం నేతృత్వంలో కీలక సమావేశాలు, వ్యూహాలకు పదును