Uddhav vs Shinde: 


ఠాక్రే అప్లికేషన్‌నీ పరిగణించాలి కదా: సుప్రీం కోర్టు 


"శివసేన ఎవరిది" అనే అంశంపై ఉద్దవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య చాలా రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఎన్నికల సంఘం మెజార్టీ నిరూపించుకుని శివసేన ఎవరిదో తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. అయితే ఈ ప్రక్రియకు బ్రేక్‌ వేయాలని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశించింది. తమనే "రియల్ శివసేన"గా గుర్తించాలని ఏక్‌నాథ్ శిందే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవటంపై ఇలా స్పందించింది సుప్రీం కోర్టు. శివసేన పార్తీ గుర్తును తమకే కేటాయించాలనీ శిందే ఇందులో ప్రస్తావించారు. ఈ రెండు అంశాలనూ విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏక్‌నాథ్ శిందే అప్లికేషన్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు..ఉద్దవ్ ఠాక్రే పిటిషన్‌ను కూడా పరిగణించాలని తేల్చి చెప్పింది. ఆగస్టు 8 వ తేదీన మహారాష్ట్రలోని రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశముందని అభిప్రాయపడింది.


ఇప్పటికే ఏక్‌నాథ్ శిందేపై సుప్రీం కోర్టులో విమర్శలు గుప్పించింది ఉద్దవ్ ఠాక్రే శివసేన టీం. పార్టీకి వెన్నుపోటు పొడిచింది కాకుండా, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేన ఎవరిది అన్న అంశంపై  సుప్రీం కోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసింది. "శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కట్టు కథలు అల్లారు" అని సుప్రీం కోర్టుకి వెల్లడించింది ఠాక్రే టీం. "ఫ్లోర్ టెస్ట్ నుంచి, ఏక్‌నాథ్ శిందేని ముఖ్యమంత్రిగా ప్రకటించిప్పటి వరకూ జరిగిన పరిణామాలన్నీ విషపూరితమైన చర్యలే. రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులోనూ అదే విషాన్ని చిమ్ముతున్నారు" అని ఠాక్రే బృందం గట్టిగా వాదిస్తోంది. యాంటీ పార్టీ కార్యకలాపాలను కవర్ చేసుకునేందుకే "రియల్ సేన" అనే అంశం తెరపైకి తీసుకొచ్చి ఈసీని సంప్రదించారని మండి పడుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్రను వదిలేసి, భాజపా పాలిత గుజరాత్‌కు వెళ్లటం, అస్సోంలోని భాజపా ఒడిలో కూర్చోవటాన్ని తలుచుకుంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని అంటున్నారు ఠాక్రే బృందంలోని నేతలు. 


స్పష్టత వచ్చేది అప్పుడే..


రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ పూర్తయ్యేంత వరకూ ఎన్నికల సంఘం "శివసేన ఎవరిది" అనే అంశాన్ని పక్కన పెట్టాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు ఉద్దవ్ ఠాక్రే. ఇప్పటికే సుప్రీం కోర్టు ఠాక్రేకు, శిందేకు ఆదేశాలిచ్చింది. ఎవరికి మెజార్టీ ఉందన్నది నిరూపించుకుని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌లను సబ్మిట్ చేయాలని చెప్పింది. ఆగష్టు 8వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే...రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయం తేలనంత వరకూ, ఎవరికి ఎంత బలం ఉంది అన్నది తేల్చి చెప్పలేమని అంటున్నారు ఠాక్రే. అందుకే...తీర్పు వచ్చేంత వరకూ ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. 


Also Read: NTR : విదేశాల నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్ - మేనత్త ఉమామహేశ్వరి మరణంతో


Also Read: Rakul Preet Singh: ఎరుపెక్కిన అందాలతో విందు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్