Retired Govt Employees Will No Longer Get DA Hikes:  పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.  ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారం, పదవీ విరమణ చేసిన సర్కారీ ఉద్యోగులు ఇకపై డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు లేదా భవిష్యత్తు పే కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కాదు. రాబోయే 8వ పే కమిషన్ ప్రయోజనాలు కూడా  దక్కవు. ఫైనాన్స్ యాక్ట్ 2025  ప్రభుత్వం ఇకపై పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత తీసుకోదని స్పష్టం చేస్తోంది.  

Continues below advertisement


లక్షలాది పెన్షనర్లకు ఫైనాన్స్ యాక్ట్ 2025 గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) ,  పే కమిషన్ సిఫార్సుల ద్వారా సవరించిన పెన్షన్‌లను అందుకుంటున్నారు.   1972 పెన్షన్ యాక్ట్‌ను కూడా రద్దు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్ట్ కింద అనేక మంది పెన్షనర్లు ప్రయోజనాలను పొందుతున్నారు.1982 సెప్టెంబర్ 17న, సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్, జస్టిస్ Y.V. చంద్రచూడ్ నేతృత్వంలో, పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరు  పెన్షనర్లను సమానంగా చూడాలని తీర్పు ఇచ్చింది.  పెన్షన్‌ను చివరిగా పొందిన జీతంలో 50 శాతానికి సమానంగా సుప్రీంకోర్టు  నిర్ధారించింది. అందుకే సెప్టెంబర్ 17ని చాలా మంది ‘పెన్షనర్స్ డే’గా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఫైనాన్స్ యాక్ట్ 2025 ఈ  విధానాలను రద్దు చేస్తోంది. 8వ పే కమిషన్ మరియు DA పెంపులు సైతం ప్రస్తుత పెన్షనర్లకు వర్తించకుండా నిబంధనలు తెచ్చింది.                   


 ఈ నిర్ణయం పెన్షనర్లు , వారిపై ఆధారపడిన వారిలో  ఆందోళన రేకెత్తిస్తోంది.  ఈ కొత్త నిబంధనలు 1982 సుప్రీం కోర్టు తీర్పు వల్ల వచ్చిన  రక్షణలను రద్దు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం కాదని ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.  అయితే ఈ  మార్పుల గురించి ప్రభుత్వం ఇంకా అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదు. అదే సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయని కూడా చెప్పలేదు. ఫైనాన్స్ యాక్ట్  భారత పార్లమెంటు ఆమోదించే వార్షిక చట్టం. ఇది ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేస్తుంది.             


కేంద్రం అధికారిక ప్రకటన చేసే వరకూ వేచి ఉండాలని.. నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతూండటంతో పెన్షనర్లకు ఆందోళన పెరుగుతోంది.  ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారం చూస్తే.. పెన్షన్ ఇప్పుడు ఎంత ఉందో.. ఎప్పటికీ అంతే ఉంటుంది. ఇక పెరగదు.కానీ ధరలు మాత్రం పెరుగుతూ ఉంటాయి.