Lakhimpur Kheri Incident: 'నేను, నా కుమారుడు ఆ కారులో లేం.. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధం'

ABP Desam   |  Murali Krishna   |  06 Oct 2021 07:46 PM (IST)

లఖింపుర్ ఘటనలో తనపై వస్తోన్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఖండించారు. ఎలాంటి దర్యాప్తుకైనా తాను సిద్ధమన్నారు.

తనపై వస్తోన్న విమర్శలను ఖండించిన అజయ్ మిశ్రా

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను మొదటి నుంచి కేంద్రమంత్రి ఖండించారు. ఎలాంటి దర్యాప్తు ప్యానల్ ముందైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 

ఘటన జరిగిన సమయంలో తాను కానీ తన కుమారుడు కానీ అక్కడ లేమని ఆయన పునరుద్ఘాటించారు.

లఖింపుర్ ఖేరీలో ఆదివారం ఘటన జరిగిన సమయంలో నేను, నా కుమారుడు అక్కడ లేము. మా కారును వేరే దారిలో మళ్లించారు. ఎలాంటి ప్యానెల్ ముందైనా సాక్ష్యం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఘటనను అన్ని కోణాల నుంచి దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయి. నిజాలు బయటకి వస్తాయి. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు.                                          -   అజయ్ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతుందని అజయ్ మిశ్రా వెల్లడించారు. అయితే తన పేరు ఎఫ్ఐఆర్‌లో నమోదైందని వస్తోన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. న్యాయ విధానాల గురించి తనకు తెలుసని.. ఓ సాధారణ పౌరుడిలానే విధానాలను గౌరవిస్తానన్నారు.

రాజీనామా వార్తలపై..

ఈ ఘటన కారణంగా తన పదవికి రాజీనామా చేయమని ప్రతిపక్షాలు కోరడం సమంజసం కాదన్నారు అజయ్ మిశ్రా.

ప్రపంచంలో మన దేశ ఖ్యాతి పెరుగుతోంది. ప్రధాని మోదీ, భాజపాకు మంచి ప్రచారం జరుగుతోంది. మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేని ప్రతిపక్షాలు ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నాయి.                                             - అజయ్ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

తన కుమారుడికి భద్రత కోరారా అన్న ప్రశ్నకు మిశ్రా స్పందిస్తూ తాను తన కుమారుడికి ఎలాంటి భద్రత కోరలేదని.. తన జిల్లాలో ఎలాంటి సమస్యలు లేవన్నారు.

ఈ రోజు ఉదయం హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాతో అజయ్ మిశ్రా సమావేశమయ్యారు. లఖింపుర్ ఘటన గురించి అమిత్ షా కు ఆయన వివరించినట్లు సమచాారం.

ఆశిష్ మిశ్రాపై కేసు..

ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతులపై దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో అజయ్ మిశ్రా పేరు కూడా ఉంది.

రూ.50 లక్షల సాయం..

లఖింపుర్ ఘటనలో మరణించిన రైతులు, జర్నలిస్టు కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ప్రకటించాయి ఛత్తీస్‌గఢ్, పంజాబ్ ప్రభుత్వాలు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.

 Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at: 06 Oct 2021 07:42 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.