ఇది చరిత్రాత్మకం..


అరుదైన, స్వచ్ఛమైన పింక్ డైమండ్ ఒకటి తవ్వకాల్లో బయట పడింది. 300 ఏళ్లలో దొరికిన వజ్రాల్లో అతి పెద్దది ఇదే. మధ్య ఆఫ్రికాలోని అంగోలాలో ఈ డైమండ్‌ను కనుగొన్నారు. ఈ 170 క్యారెట్ల డైమండ్‌ని లూలో రోజ్ (Lulo Rose)గా పిలుచుకుంటున్నారు. అంగోలాలోని ఈశాన్య ప్రాంతంలో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. అదే ప్రాంతంలో లూలో మైన్‌లో ఈ వజ్రాన్ని బయటకు తీశారు. అంగోలా, లెసోతోలో అతి  విలువైన మైన్‌లున్న లుకాపా డైమండ్ కంపెనీ (Lucapa Diamond Company) లూలో రోజ్ ఎంతో విలువైందని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ గుర్తించిన వాటిలో ఇదే పెద్దదని వెల్లడించింది. లూలో మైన్‌లో అక్కడి ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. ఈ అరుదైన డైమండ్ దొరకటంపై ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. ఇదో చరిత్రాత్మక పరిణామమని వ్యాఖ్యానించింది. ఈ డైమండ్‌ను వెలికి తీయటం ద్వారా, అంగోలా పేరు 
మరోసారి ప్రపంచమంతా మారుమోగుతుందని అంటోంది అక్కడి ప్రభుత్వం. ప్రపంచంలోనే డైమండ్ మార్కెట్‌లో అంగోలా కీలక పాత్ర పోషిస్తుందనటానికి ఇదే ఉదాహరణ అని చెబుతోంది. 


ధర ఎంతో తెలిసేది అప్పుడే..


బ్లూంబర్గ్‌ రిపోర్ట్ ప్రకారం...ఈ వజ్రాన్ని ఇంటర్నేషనల్ టెండర్ వేసి విక్రయిస్తారు. అంగోలియాకు చెందిన డైమండ్ ట్రేడింగ్ కంపెనీ సోడియం ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ వజ్రం విలువ ఎంతై ఉంటుందని నిర్ధరించటానికి దాన్ని కట్ చేసి పాలిష్ చేయాల్సి ఉంటుంది. డైమండ్‌ను కట్ చేసి పాలిష్ చేయటం వల్ల దాదాపు 50% బరువు పోతుంది. అప్పుడు ఈ  వాల్యూ ఎంత అన్నది నిర్ణయిస్తారు. గతంలోనూ పింక్ డైమండ్స్‌ని విక్రయించారు. 2017లో 59.6 క్యారెట్ల పింక్ డైమండ్‌ను 71.2 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఇప్పటి వరకూ అమ్మిన వాటిలో ఇదే అధికం. ఇప్పుడు మరో పింక్‌ డైమండ్ దొరకటం వల్ల దాని ధర ఈ రేట్‌ను మించిపోనుంది. ఆఫ్రికాలోనే కాదు. మరి కొన్ని దేశాల్లోనూ వజ్రాలు, వైఢూర్యాల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఫిన్ లాండ్‌లోని ఓ నిధి కోసం 34 ఏళ్లుగా 'ట్వెల్వ్ టెంపుల్' టీమ్‌ చాలా కష్టాలు పడుతోంది. ఫిన్ లాండ్ రాజధాని హెల్సింకికి తూర్పున 20 మైళ్ల దూరంలో సిబ్బోస్‌బర్గ్ గుహలో ఇది ఉంది. దాదాపు లక్ష కోట్ల వరకు నిధి ఉంటుందని అంచనా. ఇది ఇప్పటివరకు కనుగొన్న.. అత్యంత విలువైన నిధి. వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, రత్నాలు, పురాతన కళాఖండాలు వంటిని ఇందులో ఉంటాయని పరిశోధకులు, చరిత్రాకారులు చెబుతున్నారు. భూగర్భ ఆలయంలో నిధి దాచి పెట్టారని అంటున్నారు. 34 ఏళ్లుగా ఈ ప్రాంతంలో అన్వేషణలు జరుగుతున్నప్పటికీ, నిధిని ఎవరూ కనుగొనలేకపోయారు. చలికాలం వస్తే చాలు.. గుహలో నీరంతా గడ్డ కట్టుకుపోతుంది. దశాబ్దాలుగా ఇక్కడే క్యాంపు వేసుకుని ఉంటున్నారు.


Also Read: Viral Video: కొత్తగా పెళ్లైన జంట రోడ్ సైడ్‌ ఏం చేస్తోందో చూడండి- వైరల్ వీడియో