Vishakhapatnam Woman Missing News: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బీచ్ లో సోమవారం రాత్రి (జూలై 25) మిస్సయిన సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్టు గుర్తించారు. పెళ్లి రోజు సరదాగా గడిపేందుకు దంపతులు వైజాగ్ బీచ్ కు వచ్చిన సమయంలో, భర్త ఫోన్ చూస్తుండగా సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. సముద్రంలోకి వెళ్ళిపోయి ఉంటుందని భర్త శ్రీనివాస్ భావించారు. అయితే, నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా తాజాగా బయటికి వచ్చింది.


శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయిప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.


శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి ప్రియ రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్‌ డే అని శ్రీనివాస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్‌ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.


గాలింపు కోసం రూ.లక్షల్లో ఖర్చు..
సాయిప్రియ సముద్రంలో గల్లంతయిందేమోనని నేవీ హెలికాప్టర్ లతో 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం అధికారులు లక్షల్లో ఖర్చు పెట్టారు. హెలికాప్టర్లను మోహరించి పదే పదే సముద్రంపై తప్పుతూ ఆమె కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. హెలికాప్టర్లు తిప్పేందుకు రూ.లక్షల్లో ఇంధనం ఖర్చయింది. సాయిప్రియ నెల్లూరు వెళ్లిపోవడం.. ఆమె సముద్రంలో గల్లంతైందని ఎంతో మంది అధికారులను పరుగులు పెట్టించడమే కాక, ఫ్యామిలీని కూడా ఆందోళనకు గురిచేసింది.



ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.