Rameshwaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది NIA. ఐసిస్‌తో లింక్‌లున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానిత ఉగ్రవాది మినాజ్ అలియాస్ సులేమాన్‌ని బళ్లారి సెంట్రల్ జైల్‌కి తరలించారు. ప్రస్తుతం మినాజ్‌ని NIA పూర్తి స్థాయిలో విచారిస్తోంది. బళ్లారిలోనే కౌల్ బజార్‌లో ఉంటున్న సులేమాన్‌కి ఐసిస్‌కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మినాజ్‌ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రామేశ్వరం పేలుడు కేసుకి మినాజ్‌కి లింక్ ఉండొచ్చని NIA అనుమానిస్తోంది. అందుకే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది. మార్చి 9వ తేదీ వరకూ ఈ కస్టడీ ఉంటుంది. ఈ కేసుపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక వివరాలు వెల్లడిస్తోంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేసింది. బాంబర్ బస్‌లో తుమకూరుకి వెళ్లాడని, అక్కడే దుస్తులు మార్చుకున్నాడని అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి బళ్లారికి బస్‌లో వెళ్లినట్టు భావిస్తున్నారు. నిందితుడు బస్‌లో ప్రయాణించినట్టు కొన్ని ఆధారాలున్నట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర వెల్లడించారు. అన్నిచోట్లా సీసీ కెమెరా ఫుటేజ్‌లని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బళ్లారిలో ఐసిస్ మాడ్యూల్‌తో సులేమాన్‌కి సంబంధాలున్నట్టు NIA అనుమానిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా NIA సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో నలుగురిని అరెస్ట్ చేసింది. డిసెంబర్ 14వ తేదీన కేసు నమోదు చేసింది.