TDP Into NDA: తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చేరడం ఖాయమైపోయింది. అధికారిక ప్రకటనే తరువాయి. గురువారం రాత్రి జరిగిన చర్చల్లో ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. ఇన్ని రోజులు సాగిన పొలిటికల్‌ సీరియల్‌కు ఇవాళ పుల్‌స్టాప్‌ పడనుంది. ఇకపై కొత్త ఎపిసోడ్ ప్రారంభం కానుంది. 


2014 సీన్ ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కానుంది. తెలుగు దేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలకు పుల్‌స్టాప్ పడింది. సీట్ల సర్దుబాటుపై కూడా ఓ అవగాహనకు వచ్చాయని సమాచారం. మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేయనున్నాయి. 


175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాలలో పోటీ  చేసే ఛాన్స్ ఉంది. 25 పార్లమెంట్‌ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే... మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. అంటే ఐదు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ పడనుంది. అదై టైంలో 24 ఎమ్మెల్యే సీట్లలో జనసేన పోటీ చేయనుంది. ఆరు సీట్లు బీజేపీకి కేటాయించనున్నారు.


అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ జనసేనకు కేటాయించారు. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు.