Rajouri Earth Quake: జమ్ము కశ్మీర్ లోని రాజౌరీలో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం రోజు తెల్లవారుజామున 3.49 గంటల సమయంలో రాజౌరీలో భూమి కంపించింది. అయితే దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.






జమ్ము కశ్మీర్ లోని దోఢా ప్రాంతంలో ఈనెల 8వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 12.4 గంటలకు 4.9 భూమి కంపించింది. అదే విధంగా ఆగస్టు 4వ తేదీన గుల్ మార్గ్ లో 5.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. 


గత నెలలోనూ 4.7 తీవ్రతతో లద్దాఖ్ లో భూకంపం


జమ్ము కశ్మీర్‌లో భూకంపం కలకలం రేపింది. జులై 4వ తేదీన ఉదయం 7.38 నిముషాలకు ఉన్నట్టుండి భూమి కంపించింది. లద్దాఖ్‌లో ఈ ప్రభావం కనిపించింది. కార్గిల్‌కి 401 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో 150 కిలోమీటర్ల లోతు వరకూ భూమి కంపించినట్టు భూకంప కేంద్ర వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7గా తీవ్రత నమోదైంది. అయితే...ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లలేదని భూకంప కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జూన్ 18వ తేదీన లేహ్ లద్దాఖ్‌ ప్రాంతంలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదైంది. అదే రోజున జమ్ముకశ్మీర్‌లోని దొడ జిల్లాలో రెండు సార్లు భూమి కంపించింది. అప్పుడు కూడా ఉదయమే ఈ ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఘటనలో కొన్ని భవనాలకు పగుళ్లు వచ్చాయి. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. 






ఢిల్లీలోనూ..


జూన్ 13న దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేశాయి. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ లోని దోడాలో భూకంపం ఆందోళనకు గురి చేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4 గా నమోదు అయింది. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ - ఎన్‌సీఆర్(నేషనల్ క్యాపిటర్ రీజియన్), పంజాబ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. జమ్మూ కశ్మీర్ లో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించగా, ఢిల్లీలో 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. మణిపూర్ లో సైతం 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రత నమోదు అయింది. దీని ప్రకంపనలు హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లలో కనిపించింది. దోడాలో సంభవించిన ప్రధాన భూకంపం తర్వాత ఆయా రాష్ట్రాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదు అయ్యాయి.