Rajasthan Political Crisis:


ఇప్పటికేం లేనట్టే..


ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న సవాళ్లలో ఒకటి పార్టీ ఉనికిని కాపాడుకోవటం అయితే..మరోటి అధికారంలో ఉన్న రాష్ట్రాలను చేజార్చుకోకుండా జాగ్రత్తపడటం. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న మాటే కానీ..ఎప్పుడూ అంతర్గత విభేదాలు బయటకు కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవలే రాజస్థాన్‌లో ఇది బయటపడింది. సచిన్ పైలట్, అశోక్ గహ్లోట్‌ వర్గాలు సీఎం కుర్చీపై రగడ మొదలుపెట్టాయి. అశోక్ గహ్లోట్‌ ఇందులో కాస్త అతిగా జోక్యం చేసుకుని...అధిష్ఠానం ఆగ్రహానికీ గురయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు ఖర్గే చేపట్టాక...ముందుగా ఈ సమస్యనే పరిష్కరించేందుకు పావులు కదుపుతున్నట్టు నిన్న మొన్నటి వరకు గట్టిగానే వార్తలు వినిపించాయి. ఆయన పెద్ద ట్విస్టే ఇస్తారనీ అంచనా వేశారు. కానీ...అదేం లేదని మరో వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. ప్రస్తుతానికి ఖర్గే రాజస్థాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదని తెలుస్తోంది. గహ్లోట్‌ను సీఎం కుర్చీ నుంచి పక్కకు తప్పించడంపై మల్లికార్జున్ ఖర్గే ఏ మాత్రం ఆసక్తిగా లేరని సమాచారం. అంటే...పరోక్షంగా సచిన్ పైలట్ వర్గాన్ని "సైలెంట్‌"గా ఉండమని హెచ్చరించినట్టే. రాజస్థాన్ రాజకీయాల్లో అలజడి రేపిన గహ్లోట్‌పై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం భావించటం లేదట. నిజానికి...పైలట్, గహ్లోట్ ఫైట్ చాన్నాళ్లుగా కొనసాగుతోంది. అధిష్ఠానానికి ఇది తలనొప్పి తెచ్చి పెడుతోంది. అయినా...ఎందుకు పరిష్కరించకుండా వదిలేస్తున్నారనేదే అర్థం కావట్లేదు. ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక...అశోక్ గహ్లోట్‌తో భేటీ అయ్యారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే పైలట్ విషయం ప్రస్తావించి ఉంటారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేదీ చర్చించారట. 


రాహుల్ వల్లే అవుతుంది..


కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేపట్టారు. అయితే అదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించడం కేవలం రాహుల్ గాంధీ వల్లే సాధ్యమవుతుందని 
గహ్లోత్ అన్నారు. 
" రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే ఆయన మాత్రమే మోదీని, భాజపా ప్రభుత్వాన్ని సవాల్ చేయగలరు. అయితే గాంధీయేతర వ్యక్తి పార్టీ అధ్యక్షుడవ్వాలనేది రాహుల్ గాంధీ కోరిక. అందుకే ఇది సాధ్యమైంది. ఈ రోజు మా పార్టీకి సరికొత్త ఉషోదయం. మల్లికార్జున్ ఖర్గేను మేం అభినందిస్తున్నాం. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం.                       "
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి 


ఖర్గేకు బాధ్యతలు..


సోనియా గాంధీ అధికారికంగా తన బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు. ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుందని ఆకాంక్షించారు. ప్రమాణ స్వీకారం చేశాక ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ క్షణం నేనెంతో భావోద్వేగానికి గురవుతున్నాను. ఓ సాధారణ కార్మికుడి కొడుకుని 
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడటం నా ప్రధాన బాధ్యత" అని స్పష్టం చేశారు ఖర్గే. అంతే కాదు. రాజకీయాల్లో "త్యాగం" గురించి మాట్లాడాలంటే ముందుగా సోనియా గాంధీ గురించే చెప్పాలని అన్నారు. 


Also Read: Politics Trends : కోర్టు కన్నా ప్రజాకోర్టుకే కేసీఆర్ ప్రాధాన్యం - ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టేసినట్లేనా ?