Rahul Gandhi prepares for nationwide tour : లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ) , భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల్లో "వోట్ల చోరీ"కి పాల్పడ్డారని ఆరోపిస్తూ "వోటర్ అధికార్ యాత్ర" (Voter Adhikar Yatra)ను ప్రారంభించనున్నారు. ఆదివారం నుంచి బీహార్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఓటరు జాబితాలను నిర్ధారించడం , రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం లక్ష్యంగా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. ఈసీ డిజిటల్ డేటాను అందించకుండా, లక్షల కాగితాల రూపంలో భౌతిక డేటాను మాత్రమే ఇస్తుందని, దీని వల్ల వారి "చోరీ" బయటపడకుండా ఉంటుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈసీ గత 10-15 సంవత్సరాల ఎలక్ట్రానిక్ ఓటరు డేటా, సీసీటీవీ ఫుటేజీని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లతో రాహుల్ గాంధీ ఆగస్టు 17, 2025న బీహార్లో "వోటర్ అధికార్ యాత్ర"ను ప్రారంభించనున్నారు.
బీహార్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జరుగుతోంది. 65 లక్షల ఓట్లను తొలగించారు. దీన్ని రాహుల్ "సంస్థాగత చోరీ"గా ఆరోపిస్తున్నారు. ఈ యాత్ర భారత్ జోడో న్యాయ్ యాత్ర కు కొనసాగింపుగా భావిస్తున్నారు రాహుల్ గాంధీ మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా ఇలాంటి వోట్ల చోరీ జరిగినట్లు ఆరోపించారు. ఉత్తరాఖండ్లో ఒక రోడ్షోలో వేలాది మంది పాల్గొన్నప్పటికీ, ఓటింగ్ బూత్లలో ఓట్లు లేనట్లు గుర్తించారని, ఇది అసాధ్యమని ఆయన చెబుతున్నారు. 2023లో భారత్ జోడో యాత్ర సమయంలో బీజేపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కేవలం 65 సీట్లు మాత్రమే పొందిందని ఆయన ఆరోపించారు. ఈ పాదయాత్ర ద్వారా ఓట్ల చోరీని ప్రత్యక్షంగా నిరూపించాలని రాహుల్ అనుకుంటున్నారు.
రాహుల్ గాంధీ ఆరోపణల కారణంగా ఎన్నికల సంఘం ఆగస్టు 17, 2025న ఒక ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈసీ ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ఆరోపణలకు స్పందించే అవకాశం ఉంది, ముఖ్యంగా కర్ణాటకలోని మహదేవపుర సెగ్మెంట్లో 1,00,250 నకిలీ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు, బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎలక్టోరల్ రోల్స్పై కూడా వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.