Reactions On Modi :  ప్రతిపక్ష పార్టీల కూటమిని ప్రధాని మోదీ ఉగ్రవాద సంస్థలతో పోల్చడంపై రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు .  ''మోదీజీ...మీరు మమ్మల్ని ఏవిధంగానైనా పిలవండి...మేము INDIA'' అంటూ రాహుల్ సోషల్ మీడియాలో స్పందించారు.  విపక్షాల కూటమి INDIA అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రతిపక్షాల తీరు మారుతుందా అని ప్రధాన మంత్రి మోదీ ప్రశ్నించారు.  గతంలో ఈస్ట్ అండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వారి పేర్లలో కూడా ఇండియా ఉందని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  స్పందించారు.   మణిపూర్ తిరిగి స్వస్థత పొందడానికి, ప్రతి ఒక్క మహిళ, చిన్నారుల కన్నీళ్లు తుడవడానికి తాము చేయూతనిస్తామని, ప్రజలందరిలోనూ ప్రేమ, శాంతి తిరిగి తీసుకువస్తామని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయ ఆత్మను మణిపూర్‌లో పునరుద్ధస్తామని అన్నారు.   





 


మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారంనాడు రాజ్యసభలో తిప్పికొట్టారు. ఓవైపు మణిపూర్ రగులుతుంటే ప్రధానమంత్రి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లడటం ఏమిటని నిలదీశారు. దీనికి ముందు, ఇండియా కూటమి సమావేశంలో మణిపూర్‌ విషయంపై మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశమైంది. మణిపూర్ హింసపై పార్లమెంటులో మోదీ ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి కూడా వచ్చింది. 



మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇండియా కూటమి పార్టీల సమావేశంలో అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించారు. మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఇండియా డిమాండ్ చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
 





 


పార్లమెంటు భవనంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో విపక్షాల ఇండియా కూటమిపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, చివరకు పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థల పేరులోనూ ఇండియా ఉందని అన్నారు. INDIA పేరు పెట్టుకున్నంత మాత్రన ప్రతిపక్షాల తీరు మారుతుందా? ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదంటూ విమర్శించారు.