Rahul Gandhi Twitter Bio:


బయో మారింది..


అనర్హతా వేటు పడిన తరవాత రాహుల్ గాంధీ ట్విటర్ బయో మార్చేశారు. అంతకు ముందు వాయనాడ్ ఎంపీ అని బయోలో రాసుకున్న రాహుల్...ఇప్పుడు Dis'Qualified MP అని మార్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. బీజేపీపై గట్టిగానే పోరాడుతున్న ఆయన...ట్విటర్‌ బయోలోనూ డిస్‌క్వాలిఫైడ్ అని పెట్టుకోవడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించే ప్రయత్నిస్తున్నారు. ఆ తరవాత కీలక ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. అదానీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా బీజేపీ భావిస్తోందని సెటైర్లు వేశారు. దేశం అంటే వాళ్లకు కేవలం అదానీయే అంటూ మండి పడ్డారు. 




"అదానీపై విమర్శలు చేస్తే భారత దేశాన్ని కించపరిచారంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. వాళ్లకు దేశం అంటే అదానీ మాత్రమే. అదానీయే వాళ్ల దేశం. లేదంటే...ప్రధాని మోదీ అదానీని రక్షించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు..?"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత 






అన్నీ అదానీకే..


ఇప్పటికే ప్రెస్‌కాన్ఫరెన్స్ పెట్టి బీజేపీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు రాహుల్ గాంధీ. గంపగుత్తగా అదానీకి అన్ని ప్రాజెక్టులనూ కట్టబెడుతున్నారని, దీనిపై మాట్లాడినందుకే తనపై అనర్హతా వేటు వేశారని విమర్శించారు. యూకే స్పీచ్‌పై కొందరు కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేశారని మండి పడ్డారు.  ప్రశ్నించడం ఆపేయను అని తేల్చి చెప్పిన రాహుల్...దేనికీ భయపడను అని స్పష్టం చేశారు. అదానీ అంశాన్ని ప్రస్తావించారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచి అదానీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అదానీ, మోదీ సంబంధంపై మాట్లాడినందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి ఎయిర్‌పోర్ట్‌లను గంపగుత్తగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందుకోసం నిబంధనలు కూడా అనుకూలంగా మార్చేశారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తూనే ఉంటాని తేల్చి చెప్పారు. అదానీకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


మోదీ భయపడ్డారు..


లోక్‌సభలో ఉద్దేశపూర్వకంగా తన ప్రసంగాలను రికార్డుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చే హక్కు ఉంటుందని, కానీ అందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని వెల్లడించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు రెండు లేఖలు రాసినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు.అదానీ వ్యవహారంపై తన ప్రసంగాన్ని విని ప్రధాని మోదీ భయపడ్డారని, ఆయన కళ్లలోనూ ఆ భయం కనిపించిందని తెలిపారు రాహుల్. అందుకే ముందు ఈ వ్యవహారం నుంచి దృష్టి మరల్చారని, ఆ తరవాత తనపై అనర్హతా వేటు వేశారని మండి పడ్డారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినప్పటికీ పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు.  


Also Read: Congress Protest: రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో ఉద్రిక్తత