PM Modi US Visit:


వైట్‌హౌజ్‌లో ప్రెస్‌మీట్..


ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అమెరికాలో అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. రిపోర్ట్‌రుల ఆయనను కొన్ని ప్రశ్నలు వేయగా...మోదీ అన్నింటికీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ ఊహించని ప్రశ్న ఎదురైంది. "ఇండియాలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని, మైనార్టీలపై వివక్ష కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ సమాధానమేంటి..? మతపరమైన వివక్ష లేకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు" అని ఓ రిపోర్టర్ అడిగారు. ప్రధాని మోదీ ఈ ప్రశ్నను విని ఒకింత అసహనానికి గురయ్యారు. "మీరేం మాట్లాడుతున్నది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది" అంటూ బదులిచ్చారు. ఆ తరవాత తన అభిప్రాయాలను వెల్లడించారు. 


"మీరు అడుగుతున్నది వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మాది ప్రజాస్వామ్య దేశం. అదే మాకు స్ఫూర్తి. ప్రజాస్వామ్యం మా రక్తంలోనే ఉంది. అదే మా శ్వాస, మా జీవన విధానం. మా రాజ్యాంగంలోనూ ఇదే ఉంది. మానవ విలువలు, హక్కులకు స్థానం లేని చోట ప్రజాస్వామ్యం ఉండదు. ఎక్కడైతే డెమొక్రసీ ఉంటుందో అక్కడ వివక్షకు తావుండదు. మా దేశంలో వివక్ష అనేదే లేదు. అది కులం కావచ్చు, మతం కావచ్చు..ఇంకే విధంగా కూడా ఎవరిపైనా ద్వేషాలు లేవు. మా నినాదం ఒక్కటే. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్"


- ప్రధాని నరేంద్ర మోదీ 










ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలను మతాలు, కులాలకు అతీతంగా అందరూ అందిపుచ్చుకునే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఈ ప్రశ్న తెరపైకి రావడానికి ఓ కారణముంది. అమెరికా హౌజ్‌లోని ముగ్గురు కీలక నేతలు ప్రధాని మోదీ ప్రెస్‌మీట్‌ని బైకాట్ చేశారు. మైనార్టీల హక్కుల్ని అణిచివేస్తున్నారని ఆరోపించారు. అంతకు ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఇదే విషయాన్ని మీడియాతో ప్రస్తావించారు. ముస్లిం మైనార్టీలని మోదీ ప్రభుత్వం గౌరవించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని, దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదముందని అన్నారు. 


"ఒకవేళ నాకు ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం వచ్చి ఉంటే మైనార్టీల హక్కులపై తప్పకుండా ప్రశ్నిస్తాను. వాళ్లకు గౌరవం ఇవ్వకపోతే ఇండియా చాలా కోల్పోవాల్సి వస్తుంది. విచ్ఛిన్నమయ్యే ప్రమాదమూ ఉంది. హిందువులు మెజార్టీగా ఉన్న ఇండియాలో మైనార్టీలైన ముస్లింలకు రక్షణ కల్పించాలని జో బైడెన్ మోదీకి చెప్పాలని ఆశిస్తున్నాను"


- బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు 


Also Read: PM Modi US Visit: ఆల్కహాల్‌ అలవాటుపై జోక్‌ వేసిన బైడెన్, పగలబడి నవ్విన ప్రధాని మోదీ