AI Tools in Media:


20% లేఆఫ్‌లు..


ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) టెక్నాలజీ క్రమంగా విస్తరిస్తోంది. మ్యాన్‌పవర్‌ని తగ్గించుకుని AIపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి కంపెనీలు. ఇప్పుడీ లిస్ట్‌లోకి కొన్ని వార్తా సంస్థలూ వచ్చి చేరుతున్నాయి. జర్మనీలో పాపులర్ న్యూస్ ఆర్గనైజేషన్ Axel Springer ఇదే పని చేసింది. దాదాపు 20% మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానాన్ని AI టెక్నాలజీతో రీప్లేస్ చేసింది. ఇకపై దశల వారీగా వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని పూర్తిగా AIతోనే కంపెనీ రన్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఎడిటర్ స్థాయి వ్యక్తుల నుంచి రైటర్స్, డిజైనర్స్ వరకూ అందరి స్థానాన్నీ రీప్లేస్ చేస్తోంది ఈ టెక్నాలజీ. ఇదే విషయాన్ని కంపెనీ సీఈవో మథియాస్ డాఫ్నర్ వెల్లడించారు. ఎలన్ మస్క్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన Mathias Dopfner "డిజిటల్ ఓన్లీ అప్రోచ్" అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ పబ్లిషర్  సంస్థ ఇందుకు సంబంధించి మెమొరాండం కూడా విడుదల చేసింది. ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్‌తో పాటు మరి కొన్ని రోల్స్‌ని కూడా త్వరలోనే తొలగించనున్నారు. వాళ్ల స్థానంలో పూర్తిగా డిజిటలైజ్డ్‌ టెక్నాలజీ వచ్చేస్తుంది. 


అమెరికాలోనూ ఎఫెక్ట్...


Axel Springer సంస్థ...జర్మనీలోని Bild, Welt లాంటి సంస్థలకు పేరెంట్ కంపెనీ. ఇప్పుడీ నిర్ణయం వల్ల ఈ రెండు కంపెనీలపైనా ప్రభావం పడనుంది. అటు అమెరికాలోని Politico, Insider లాంటి సైట్స్‌పైనా ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపింది పేరెంట్ కంపెనీ. "దురదృష్టవశాత్తూ AI,ChatGPT లాంటి టూల్స్ వచ్చాక మీరు చేయాల్సిన పని కూడా అవే చేసేస్తున్నాయి. అందుకే మిమ్మల్ని కంపెనీ నుంచి పంపక తప్పడం లేదు" అని తేల్చి చెబుతున్నాయి. Bild కంపెనీలో మొత్తం వెయ్యి మంది ఉద్యోగులున్నారు. వీరిలో కనీసం 200 మందిని ఇంటికి పంపనున్నారు. ఇండిపెండెంట్ జర్నలిజానికి AI తోడైతే చాలా మంచి ఫలితాలు వస్తాయని ఈ కంపెనీ భావిస్తోంది. గతంలో కన్నా బెటర్‌గా ప్రజలకు వార్తలు అందించేందుకు ఇది తోడ్పడుతుందనీ వివరిస్తోంది. కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే మార్కెట్‌లోని పోటీని తట్టుకుని నిలబడటం కష్టమవుతుందన్న వాదనా వినిపిస్తోంది. ప్రింటెడ్ జర్నలిజం రూపురేఖల్ని త్వరలోనే AI పూర్తిగా మార్చేస్తుందని చెబుతోంది. ఇదే కొనసాగితే అంతర్జాతీయంగా మీడియా సంస్థలపైనా కొత్త టూల్స్ ప్రభావం పడడమే కాకుండా వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టక తప్పదు. 


ఆటోమేషన్‌తో ముప్పు..? 


AI-ఆధారిత బాట్‌ల (Bots) వినియోగం ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన నేపథ్యంలో  మున్ముందు ముప్పుతప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆటోమేటేడ్ బాట్‌లు గత సంవత్సరం ఇంటర్నెట్‌లోని మొత్తం ట్రాఫిక్‌లో దాదాపు సగం స్థానాన్ని ఆక్రమించాయి. వాటిలో చాలా మంది స్పామ్, స్కామ్‌లు, వైరస్‌లను వ్యాప్తి చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆన్‌లైన్ కార్యకలాపాలలో దాదాపు సగం వరకు మనుషుల కంటే ఆటోమేటెడ్ బాట్‌లే నిర్వహిస్తున్నట్లు తాజాగా అధ్యయనం వెల్లడించింది. స్పామ్, సైబర్ క్రైమ్‌లతో AI-శక్తితో పనిచేసే బాట్‌లు వేగంగా  ఇంటర్నెట్‌ను స్వాధీనం చేసుకోవడంలో గణనీయంగా పురోగతి సాధించినట్లు తేలింది. 2022లో ఆన్‌లైన్‌లో ఈ రకమైన యాక్టివిటీలో భారీ పెరుగుదల కనిపించిందని, మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 47.4% మనుషుల నుంచి కాకుండా బాట్‌ల నుండి వస్తున్నాయని Impervaలోని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. 'బ్యాడ్ బాట్స్' లేదంటే జంక్ ఇమెయిల్స్ ను పంపేవి, వ్యక్తుల డేటాను దొంగిలించేవి ఈ ట్రాఫిక్‌లో 66.6%ని కలిగి ఉన్నాయని హెచ్చరించారు.