PM Modi Swachhata Abhiyan:


నాసిక్‌లోని ఆలయంలో..


ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కాలారాం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. స్వయంగా బకెట్‌లో నీళ్లు మోసుకొచ్చారు. ఆలయంలో ఓ చోట నీళ్లు పోసి శుభ్రం చేశారు. స్వచ్ఛ అభియాన్‌లో భాగంగా అందరూ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఆ తరవాత ప్రదక్షిణలు చేశారు.





ఆలయ సందర్శన తరవాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలనూ శుద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు. ఇదే సమయంలో దేశ యువత గురించి ప్రస్తావించారు. సాధువులు, యోగులు యువశక్తి గురించి ఎప్పుడూ గొప్పగా చెబుతారని, భారత్‌ అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే యువత పాత్రే కీలకమని అన్నారు. భారత్ ఆశలన్నీ యువతపైనే ఉన్నాయని వెల్లడించారు. 


"అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఉత్సవం సందర్భంగా అందరికీ నాదో విన్నపం. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుద్ధి చేయాలి. దీన్నో ఉద్యమంలా భావించాలి. మన సాధువులు, యోగులు ఎప్పుడూ యువశక్తిలోని గొప్పదనాన్ని చాటి చెప్పారు. భారత్‌ తన లక్ష్యాలు చేరుకోవాలంటే యువత స్వతంత్రంగా ఆలోచించాలి. యువత ఎంత బలంగా ఉంటేనే భారత్ కలలు నెరవేరుతాయి"


-  ప్రధాని నరేంద్ర మోదీ






యువతే కీలకం..


ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇందుకు యువతే కారణమని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. స్టార్టప్‌ సిస్టమ్‌లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని అన్నారు. భారత్‌ ఎన్నో ఆవిష్కరణలకు వేదికగా మారుతోందని సంతోషం వ్యక్తం చేశారు. దేశ యువతకి ఇది అమృత కాలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే మహారాష్ట్ర చరిత్రనూ ప్రస్తావించారు ప్రధాని మోదీ. భారత్‌లోని గొప్ప గొప్ప వ్యక్తులకు మహారాష్ట్రకు విడదీయలేని బంధం ఉందని అన్నారు. శ్రీరాముడు నాసిక్‌లో ఉన్న పంచవటిలో చాలా రోజుల పాటు ఉన్నాడని గుర్తు చేశారు. 


Also Read: Ram Mandir: మొబైల్‌ యాప్‌లో అయోధ్య శ్రీరామ టెంపుల్‌ ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవ పాస్‌లు!