PM Modi Swearing In: ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత కీలకమైంది. ఓ నేతను ఎన్నుకున్న తరవాత రాజ్యాంగ బద్ధంగా ఆయన ఆ పదవిని చేపట్టాలంటే అందరి ముందు ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయి అయితే ఆ రాష్ట్ర గవర్నర్‌ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ప్రధాన మంత్రి స్థాయి అయితే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అయితే...ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. బ్రిటీష్‌ వాళ్లు భారత్‌లో పరిపాలించినప్పటి నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. అప్పట్లో అధికారులు తమ బాధ్యతలు తీసుకునే ముందు రాజుపై విశ్వాసం చూపించుకునేందుకు ఈ ప్రమాణ స్వీకారాన్ని మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన (history of oath taking ceremonies) తరవాత కూడా ఇది కొనసాగుతూ వస్తోంది. కాకపోతే ఇప్పుడు మన దేశ రాజ్యాంగం సాక్షిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. 1947లో ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర భారత తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత ఈ దర్బార్‌ హాల్‌లోనే ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీగా వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 



1990 తరవాత ఈ ప్రక్రియలో కొన్ని మార్పులు జరిగాయి. అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 1990లో ప్రధానిగా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు దర్బార్‌ హాల్‌లో కాకుండా రాష్ట్రపతి భవన్‌ ముందున్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేయించారు. దర్బార్‌ హాల్‌ ఇరుకవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు. ఎక్కువ మంది అతిథులను పిలిచినప్పుడు అందరికీ కనిపించేలా ప్రధాని ఉండాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇలాగే రాష్ట్రపతి భవన్ ముందున్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగింది. 2014,2019లో నరేంద్ర మోదీ కూడా ఈ విధానాన్నే అనుసరించారు. వేలాది మంది అతిథులను పిలిచారు. 2014లో 4 వేల మంది, 2019లో 6 వేల మంది అతిథులు రాగా ఈ సారి ఆ సంఖ్య 8 వేలకు పెరిగింది. 1984లో తొలిసారి ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో  ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 100 కెమెరాలతో బ్రాడ్‌కాస్ట్ చేయనున్నారు. 8 వేల మంది అతిథులకు తగ్గట్టుగానే రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చేశారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 1,100 వందల మంది ట్రాఫిక్ పోలీసులు నగరాన్ని మొహరించారు. 7 దేశాల అధినేతలు వస్తుండడం వల్ల పలు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 


Also Read: PM Modi Salary: ప్రధాని నరేంద్ర మోదీ ఎంత జీతం తీసుకుంటారో తెలుసా?