Vande Bharat Express in Himachal Pradesh:


హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో..


ప్రధాని మోదీ నాలుగో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లా నుంచి ఈ ట్రైన్‌ సర్వీస్‌లు మొదలు కానున్నాయి. రేపటి నుంచి (అక్టోబర్ 13) ప్రధాని మోదీ జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందువర మార్గంలో నడుస్తుందీ ఈ ట్రైన్. వారంలో ఆరు రోజుల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. బుధవారాలు మాత్రం సేవలు నిలిపివేస్తారు. అంబాలా, ఛండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనా స్టేషన్లలో ఆగుతుంది. వచ్చే ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి  కీలక తరుణంలో వందేభారత్‌ను ప్రారంభిస్తుండటం ప్రాధాన్యత సంతరిచుకుంది. అంతే కాదు. ఇటీవలే 
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. గుజరాత్‌లో ఈ డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 2019ఫిబ్రవరి 15న మొదటి వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైళ్లలో self-propelled engine ఉంటుంది. డీజిల్‌ను ఆదా చేయడంతో పాటు...30% విద్యుత్‌తోనే నడుస్తాయి. వందేభారత్ ట్రైన్స్‌ను సెమీ హై స్పీడ్ రైళ్లుగా చెబుతోంది ఇండియన్ రైల్వేస్. వీటిని పూర్తిగా దేశీయంగా తయారు చేశారు. ఆటోమెటిక్ డోర్స్, AC చెయిర్ కార్, రివాల్వింగ్ చైర్‌లు అందుబాటులో ఉంటాయి. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో వెల్లడించారు. పీఎం గతిశక్తి లో భాగంగా ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. 


వరుస ప్రమాదాలు..


వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి ప్రమాద గండాలు తీరిపోవటం లేదు. ఇటీవలే ఓ పశువుల మందను ఢీకొట్టి ముందు భాగమంతా ధ్వంసమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రైళ్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కాస్త గట్టిగానే ట్రోల్ చేశాయి. 
అయితే వెంటనే ఈ ట్రైన్‌ని రిపేర్ చేసి ట్రాక్‌మీదకు తీసుకొచ్చారు. సమస్య తీరిపోయిందిలే అనుకుంటే మరో గండం వెంటాడింది. గాంధీ నగర్ నుంచి ముంబయికి వెళ్తున్న మార్గంలో ఆనంద్ స్టేషన్ వద్ద ఆవును ఢీకొట్టింది వందేభారత్ ట్రైన్. ముందు బంపర్ వంగిపోయింది. 
ఈ ప్రమాదం కారణంగా 10 నిముషాలు ట్రాక్‌పైనే నిలిచిపోయింది. ఫలితంగా...మరోసారి వార్తల్లోకెక్కింది. సర్వీస్‌లు ప్రారంభమై వారం రోజులు కాక ముందే వరుస ప్రమాదాలతో సతమతమవుతోంది ఇండియన్ రైల్వేస్.


అంతకు ముందు పశువుల మందను ఢీకొట్టిన సమయంలోనే కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్ట లేమని, వీటిని ముందుగా ఊహించే ట్రైన్‌ను డిజైన్ చేశామని చెప్పారు. ఈ ట్రైన్ ముందు భాగాన్ని రీప్లేస్ చేసుకునే సౌలభ్యం ఉందని వెల్లడించారు. మరుసటి రోజే మరోసారి ఆవుని ఢీకొట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర, గుజరాత్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఇటీవలే ప్రారంభించారు. వందే భారత్ రైలులో నరేంద్ర మోదీ ప్రయాణించారు. ముంబయి-గాంధీనగర్ రూట్‌లో వందే భారత్ రైలు సేవల్ని అందించనుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూ దిల్లీ-వారణాసి, న్యూ దిల్లీ-మాతా వైష్ణో దేవి కాట్రా రూట్‌లో వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి. 


Also Read: SC on Demonetisation: మోదీ సర్కార్‌కు సుప్రీం కోర్టు షాక్- నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు!


Also Read: Hawala Money Seized: హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత, ఈసారి 2 కోట్లు స్వాధీనం!