Hawala Money Seized: మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు తెలంగాణలో భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి భారీగా హవాల డబ్బు పట్టబడింది. గత పది రోజుల వ్యవధిలోనే పది కోట్ల రూపాలయను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బంజారాహిల్స్ పోలీసులు రోడ్ నెంబర్ - 12లో వాహన తనిఖీలు చేస్తుండగా.. రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు డబ్బుకు సంబంధించి సరైన సమాధానం, పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 


మంగళ వారం రోజు 3.5 కోట్లు..


గాంధీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును ట్యాంక్ బండ్ హోటల్ మారియట్ వద్ద నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గండి సాయికుమార్ రెడ్డికి వెంక‌టేశ్వ‌ర్ అనే వ్య‌క్తి రూ. 3.5 కోట్ల న‌గదు ఇచ్చాడు. ఆ న‌గ‌దును సైదాబాద్‌లో ఉండే బాలు, మ‌హేంద‌ర్‌కు ఇవ్వాల‌ని సూచించాడు. ఇదే స‌మ‌యంలో పోలీసులు అక్క‌డికి చేరుకుని త‌నిఖీలు నిర్వ‌హించారు. 3.5 కోట్ల రూపాయల న‌గ‌దుతో పాటు 7 సెల్‌ఫోన్లు, రెండు కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గండి సాయికుమార్ రెడ్డి, గుండే మ‌హేశ్‌, సందీప్ కుమార్, మ‌హేంద‌ర్, అనూష్ రెడ్డి, భ‌ర‌త్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరు ఇచ్చారు వంటి పూర్తి సమాచారం తెలపకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 


సోమవారం రోజు 2.5 కోట్లు..


జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై భారీ ట్రావెలర్స్ బ్యాగ్‌తో నగదును ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్నారు. అనుమానం వచ్చి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా ఆ బ్యాగులో రూ. 2,49,79,000 (2 కోట్ల 49 లక్షల 79 వేల రూపాయలు) ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రిసీప్ట్, పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా నిందితులు అవేమీ లేవని సమాధానమిచ్చారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఆదివారం రోజు 79.26 లక్షల పట్టివేత..


హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. చంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్ వద్ద 79 లక్షల 25వేల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. చంద్రాయణ గుట్ట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానంగా కనిపించిన రెండు కార్లను ఆపి సోదాలు చేశారు. అందులో 79.25 లక్షల డబ్బు కనిపించింది. అయితే డబ్బు తరలిస్తున్న వ్యక్తులు ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు నడుపుతున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్, హైదరాబాద్ కు చెందిన వెంకట్ రెడ్డి, శేఖర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


పది రోజుల క్రితం 1.24 కోట్ల పట్టివేత.. 


భాగన్యనగరంలో అక్రమంగా తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. మాసబ్ ట్యాంక్ పరిధిలో షోయబ్ అనే వ్యక్తి వద్ద 1.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ మీరట్ కు చెందిన షోయబ్ మాలిక్ హైదరాబాద్ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. గుజరాత్ గల్లీకి చెందిన భరత్ వద్ద తీసుకున్న ఈ డబ్బును షోయబ్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో షోయబ్ నివాసంలో తనిఖీ చేసిన పోలీసులు.. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన లెక్క చెప్పకపోవడంతో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.


నగరంలో 10 రోజుల వ్యవధిలో రూ.10కోట్లు హవాలా సొమ్మును హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడుతున్న హవాలా సొమ్ము మునుగోడు ఉపఎన్నిక కోసమే చేతులు మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.