UP Minister on Modi:


అవతార పురుషుడు


ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు సార్లు NDA అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం మోదీకున్న ప్రజాదరణే అని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అందుకే...ఉప ఎన్నిక జరిగినా సరే భాజపా ప్రధాని మోదీ ఫోటోతోనే ప్రచారం చేస్తుంది. మరోసారి కూడా ఆయనే ప్రధాని అవుతారని బలంగా విశ్వసిస్తోంది కాషాయ పార్టీ. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ దేవుడి అవతారం అని...ఆయనకు నచ్చినన్నాళ్లు పీఎం
పదవిలో కొనసాగుతారని అన్నారు గులాబ్ దేవి. "మోదీ ఓ అవతార పురుషుడు. ఆయనకు అత్యద్భుతమైన ప్రతిభ ఉంది. ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. ఆయన కోరుకుంటే బతికున్నంత కాలం ప్రధాని పదవిలోనే కొనసాగొచ్చు" అని వివరించారు. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ప్రధాని పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయాన్నీ ప్రస్తావించిన గులాబ్ దేవి.."ఇలాంటి వ్యాఖ్యలతో ఒరిగేదేం లేదు. ఆయన ఓ అత్యున్నతమైన వ్యక్తి. తన ప్రతినిధిగా దేవుడే ఆయనను భూమి మీదకు పంపారు" అని అన్నారు. ఆయన ఏదంటే అది చేస్తారని, దేశమంతా ఆయనను అనుసరిస్తోందని అన్నారు. ప్రజలు ఆయనను యాక్సెప్ట్ చేస్తున్నారనటానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏముందని ప్రశ్నించారు. 


మోదీని ఢీకొట్టేదెవరు..? 


పార్టీలు, సిద్ధాంతాలు వేరు కావచ్చు. కానీ...అందరి టార్గెట్ మాత్రం 2024 ఎన్నికలే. గత సార్వత్రిక ఎన్నికల్లో "వార్ వన్‌సైడ్" అయిపో ఎన్‌డీఏ మరోసారి అధికారం చేపట్టింది. కానీ..ఈ సారి మోడీని ఢీ కొట్టి బలమైన పోటీ ఇవ్వాలని చూస్తున్న నేతల జాబితా పెద్దగానే ఉంది. అటు పశ్చిమబెంగాల్‌ సీం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ పోటీలో నిలిచేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీదీ..ప్రతిపక్ష పార్టీలను ఒకతాటిపైకి తీసుకొచ్చే పనిలో పడిపోయారు. ఇటు కేసీఆర్ కూడా 
ఇంచుమించు అదే చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌...నిన్న మొన్నటి వరకూ ప్రధాని మోదీ విమర్శలు చేసినా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వివాదం తెరపైకి వచ్చిన తరవాత విమర్శల పదును పెంచారు. రోజూ ఏదో విధంగా ఆయనను టార్గెట్ చేస్తూ...కేంద్రం తమను కావాలనే టార్గెట్ చేస్తోందని అసహనం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకున్న ఊపులో ఉన్న ఆప్...అదే జోరుతో 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌ ఫైట్‌ పైనా అందరి దృష్టి నెలకొంది. మరి ప్రధాని మోదీ చరిష్మాను ఢీకొట్టే సామర్థ్యం కేజ్రీవాల్‌కు ఉందా..? ఈ విషయంపై ABP News కోసం C-Voter ఓ Survey నిర్వహించింది. ఈ సర్వేలో ఇంట్రెస్టింగ్ ఫలితాలు వెలువడ్డాయి. 2024లో జరిగే ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్...ప్రధాని మోదీని ఢీకొట్టగలరా అన్న ప్రశ్నపై దాదాపు 2,102 మందిపై సర్వే చేసింది C-Voter. వీరిలో దాదాపు 44% మంది "అవును" అని సమాధానమివ్వగా...56% మంది "కాదు" అని బదులిచ్చారు. మొత్తంగా చూస్తే ఈ సర్వేలో అరవింద్ కేజ్రీవాల్ వెనకబడే ఉన్నారు. 


Also Read: ABP C Voter Survey Gujarat: మోదీని తిడితే అధికారంలోకి వచ్చేస్తారా? ఏబీపీ సీ ఓటర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు