Independence Day 2022: 


ఆరోగ్య రంగానికి సంబంధించి కొత్త ప్రాజెక్ట్‌లు..? 


ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హెల్త్ సెక్టార్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. "హీల్ ఇన్ ఇండియా", హీల్‌ బై ఇండియా (Heal in India), (Heal by India) ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తారని సమాచారం. వీటితో పాటు 2047 నాటికి దేశంలో సికిల్‌ సెల్ వ్యాధి నిర్మూలించాలనే లక్ష్యాన్నీ నిర్దేశిస్తారని కొందరు అధికారులు చెబుతున్నారు. సర్వికల్ క్యాన్సర్‌ను అరికట్టేందుకు తయారు చేసిన వ్యాక్సిన్‌నూ...నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ ( National Immunisation Programme)లో చేర్చటం, నేషనల్ హెల్త్ మిషన్‌ను విస్తృతం చేస్తూ కొత్తగా "పీఎం సమగ్ర స్వాస్థ్య మిషన్"(PM Samagra Swasthya Mission) గా పేరు మార్చే ప్రకటనలు చేసే అవకాశముంది. మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజంకు భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు హీల్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అమల్లోకి తీసుకురానున్నారు. 12 రాష్ట్రాల్లోని 37 ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరుస్తారని ప్రభుత్వ అధికారులు కొందరు వివరిస్తున్నారు. హీల్ ఇన్ ఇండియాలో భాగంగా...10 విమానాశ్రయాల వద్ద స్పెషల్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ పేషెంట్ల కోసం వీసా నిబంధనలు సులభతరం చేయటం మరో కీలక అంశం. కొన్ని ప్రభుత్వ అధికారిక వర్గాలు పీటీఐకి ఈ వివరాలు వెల్లడించారు.





 


ఈ ప్రకటనలూ ఉంటాయా..? 


ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సార్క్, గల్ఫ్ సహా 44 దేశాల నుంచి పెద్ద ఎత్తున రోగులు భారత్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నట్టు కేంద్రం గుర్తించింది. ఆయా దేశాల్లో వైద్యం స్థితిగతులు ఎలా ఉన్నాయి..? అక్కడ ఎంత ఖర్చవుతోంది అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుని "హీల్ ఇన్ ఇండియా" ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. ఇక హీల్‌ బై ఇండియాలో భాగంగా...ఆరోగ్య రంగంలో భారత్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది కేంద్రం. నిపుణుల సంఖ్యను పెంచి అంతర్జాతీయ పోటీలో నెంబర్‌ వన్‌ గా నిలపాలని చూస్తోంది. ఇందుకోసం ఆరోగ్య శాఖ ఆన్‌లైన్‌లో డేటా పొందుపరచనుంది. ఇందులో హెల్త్‌కేర్ నిపుణులు, వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌ల వివరాలు ఇందులో పొందు పరుస్తారు. వారి ఇష్టానికి అనుగుణంగా ఆయా దేశాలకు వైద్య సేవలు అందించే అవకాశముంటుంది. జిల్లా స్థాయిలో కేర్ హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేషనల్ హెల్త్ మిషన్‌ను విస్తృతం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య రంగానికి కేటాయించే వనరుల్లో 5% మేర ఈ కేర్ ఆసుపత్రులకే కేటాయించనున్నట్టు సమాచారం. ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ భాగస్వామ్యంతో 2047 నాటికి దేశంలో సికిల్ సెల్‌ వ్యాధిని నిర్మూలించేందుకు రోడ్‌ మ్యాప్ తయారు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 40 ఏళ్ల లోపు ఉన్న 7 కోట్ల మందిని పరీక్షించనున్నారు. 17 రాష్ట్రాల్లోని 200 జిల్లాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. 9-14 ఏళ్ల మధ్యలో ఉన్న బాలికలకు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ అన్ని అంశాలపైనా ప్రధాని మోదీ ప్రకటనలు చేస్తారని చెబుతున్నారు. 


Also Read: Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?


Also Read: UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?