IndiGo Passenger Smokes Bidi: ఇండిగో ఫ్లైట్‌లో బీడీ తాగిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ముంబయి విమానంలో ఈ ఘటన జరిగింది. రెస్ట్‌రూమ్‌లో ఓ ప్యాసింజర్ బీడీ తాగినట్టు సిబ్బంది వెల్లడించింది. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైనట్టు తెలిపింది. ఆ వ్యక్తిని మందలించింది. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరవాత పోలీసులకు అప్పగించారు. ఉన్నట్టుండి ఫ్లైట్‌లో బీడీ వాసన విపరీతంగా వచ్చిందని సిబ్బంది స్పష్టం చేసింది. రెస్ట్‌రూమ్‌లోని ప్యాసింజర్ పొగతాగుతున్నట్టు గుర్తించింది. Aircraft Act కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ విమానాల్లో ఇలా సిగరెట్‌లు తాగి అలజడి సృష్టించిన ఘటనలు వెలుగు చూశాయి. గతేడాది ఆగస్టులో దుబాయ్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఓ వ్యక్తి రెస్ట్‌రూమ్‌లో సిగరెట్ తాగాడు. అక్కడే సిగరెట్‌ ముక్కలు కనిపించినట్టు విచారణ జరిపిన అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తిని గట్టిగా నిలదీసిన తరవాత లైటర్‌తో పాటు సిగరెట్‌ ప్యాకెట్‌లు ఇచ్చాడు. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అంతకు ముందు గతేడాది మార్చిలో కోల్‌కత్తా నుంచి బెంగళూరుకి వస్తున్న ఇండిగో ఫ్లైట్‌లోనూ ఓ ప్రయాణికుడు పొగతాగి అందరినీ టెన్షన్ పెట్టాడు. భద్రతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేశారు. 


ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ ఏరియాలో బొద్ధింకలు కనిపించడం అలజడి సృష్టించింది. ఫ్లైట్స్‌లో హైజీన్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అన్న కొత్త వాదనకు ఈ ఘటన తెర తీసింది. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్‌ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇండిగో ఫ్లైట్‌లో తనకు బొద్ధింకలు కనిపించాయని చెప్పాడు. ఫ్లైట్స్‌ని హైజీన్‌గా ఉంచాలన్న విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ మండి పడ్డాడు. ఈ పోస్ట్‌లో ఇండిగో అకౌంట్‌ని ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్‌ వైరల్ అయింది. నెటిజన్లు ఇండిగో యాజమాన్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై IndiGo స్పందించింది. అప్పటికప్పుడు అన్ని ఫ్లైట్స్‌ని క్లీన్ చేయించింది. పురుగులు లేకుండా డిస్‌ఇన్‌ఫెక్టింగ్ చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని వెల్లడించింది. అంతరాయం కలిగినందుకు క్షమించాలంటూ ఆ ప్యాసింజర్‌ని కోరింది.


"ఇండిగో ఫ్లైట్‌లో ఫుడ్ ఏరియాలో బొద్ధింకలు కనిపించి షాక్ అయ్యాను. ఇది చాలా దారుణమైన విషయం. ఫ్లైట్స్‌ని చాలా క్లీన్‌గా ఉంచుతారన్న నమ్మకంతో ప్రయాణికులంతా ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదు"


- ప్రయాణికుడు