Ayodhya Ram Mandir:


నిఘా వర్గాలు సంచలన విషయం చెప్పాయి. అయోధ్య రామ మందిరంపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతున్నట్టు వెల్లడించాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ రామ మందిరంపై అటాక్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపాయి. ఆత్మాహుతి దాడి ద్వారా ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నట్టు చెప్పాయి. నేపాల్ మీదుగా భారత్‌కు సూసైడ్ స్క్వాడ్‌ను పంపాలని చూస్తున్నట్టు తేల్చి చెప్పాయి. నిఘా వర్గాల హెచ్చరికతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే రోజున పంజాబ్, ఢిల్లీతో పాటు మరి కొన్ని కీలక నగరాల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. రోహింగ్యాల ద్వారా పలు చోట్లు IED బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినట్టు హెచ్చరించాయి. ఒకవేళ జనవరి 26న ఈ ప్లాన్ అమలు కాకపోతే..ఆ తరవాత జరిగే G20 సమ్మిట్‌ను టార్గెట్ చేయనున్నట్టు చెప్పాయి. 






వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధమైపోతుందని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ తరవాత ట్రస్ట్ సెక్రటరీ ఛంపత్ రాయ్ కూడా కీలక విషయం వెల్లడించారు. గర్భగుడి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, రామ్‌లల్లా విగ్రహాన్ని వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠిస్తామని చెప్పారు. అయితే..ఆ రాముడి విగ్రహం ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై స్పష్టతనిచ్చారు చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్. విగ్రహం ఎలా ఉంటుందో వివరించారు. 


"అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం అద్భుతంగా ఉంటుంది. రాముడు నీల మేఘ శ్యాముడు కనుక ఆ రంగులోనే విగ్రహాన్ని తయారు చేయిస్తున్నాం. రామ్ లల్లాను పోలిన విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తాం. స్వామి వారి రూపాన్ని అలా చూడగానే మైమరిచిపోతారు. అంత అందంగా ఉంటుంది. 5-6 అడుగుల ఎత్తులో ఉండనుంది. రాముడి బాలావతారం కళ్లకు కట్టినట్టుగా ఆ విగ్రహంలో కనిపించాలి. చూసిన ప్రతి ఒక్కరూ బాల రాముడే అనుకోవాలి."  
-రామ మందిరం పూజారి 


"ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే ఏడాది జనవరికి ప్రారంభమవుతుంది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ వేడుకలు కొనసాగుతాయి" అని వెల్లడించారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్‌. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నట్టు చెప్పారు. త్వరలోనే భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు. "రామ్‌లాలా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తాం. వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ఈ వేడుక జరుగుతుంది" అని చెప్పారు. గర్భ గుడి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. 9 అడుగులు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 35 అడుగుల దూరం నుంచి చూసినా...రాముడు స్పష్టంగా కనిపిస్తాడని ట్రస్ట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ శిల్పులు రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నారు. "సాధువులతో చర్చించి రాముడి విగ్రహం ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శిలలతో విగ్రహం తయారు చేయిస్తాం" అని చంపత్‌ రాయ్ చెప్పారు.