Assassinated Politicians: ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్ ను ఆదివారం (జనవరి 29)  పోలీసులు కాల్పి చంపారు. ఝార్సుగూడ జిల్లాలోని బ్రజ్‌రాజ్‌ నగర్‌లో ప్రజాఫిర్యాదుల కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన నబా దాస్‌పై పోలీసు గోపాల్ దాస్ కాల్పులు జరిపారు. ఆ తర్వాత మంత్రి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎయిర్ లిఫ్టు చేసి రాజధాని భువనేశ్వర్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడే ఆపరేషన్‌ చేసినా అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. మంత్రి మృతితో కుటుంబంతో పాటు ఒడిశా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఆరోగ్యశాఖ మంత్రి మృతిపై దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలిపారు. నబా కిశోర్ దాస్ మృతి రాష్ట్రానికి తీరని లోటని, రాష్ట్ర ప్రభుత్వానికి, బిజూజనతాదళ్‌కి నాబా దాస్‌ అస్త్రం లాంటివాడని అన్నారు. నాబా దాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికీ స్పందనలు వస్తూనే ఉన్నాయి. 


నబా దాస్‌ మృతితో దేశంలో మరోసారి రాజకీయ హత్య జరిగింది. ఎన్నో ఏళ్లుగా దేశం అనేక రాజకీయ హత్యలను చూసింది. ప్రజా ప్రతినిధి ఈ లోకాన్ని వీడినప్పుడు అతని కుటుంబానికి నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రజల కోసం పనిచేసే ఓ మంచి సేవకుడిని కూడా ప్రజలు కోల్పోతున్నారు. ఇది ఎప్పటికీ, ఎవరూ పూడ్చలేని నష్టం. ఒక్క నబా కిషోర్ దాస్ యే కాదండోయ్.. గతంలో కూడా పెద్ద పెద్ద రాజకీయ ప్రముఖులు ఘోరమైన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారు, ఆ వివరాలను ఒకసారి చూద్దాం.


సిద్ధూ మూసేవాలా..


గత సంవత్సరం (29 మే 2022) పంజాబ్‌లోని మాన్సాలోని జవహర్కే గ్రామంలో పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన సిద్ధూ ముసేవాలాను కూడా కాల్చి చంపారు. దాదాపు 30 బుల్లెట్లు అతడిపైకి దూసుకెళ్లాయి. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ సిద్ధూ ముసేవాలాను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం ప్రకారం.. కెనడా నుంచి తన ముఠాను నిర్వహించే గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఆదేశాల మేరకు సిద్ధూ ముసేవాలాను హత్య చేశారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 36 మంది పేర్లు ఉన్నాయి. సిద్ధూ ముసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ప్రస్తుతం న్యాయం కోసం పోరాడుతున్నారు.


కమలేష్ తివారీ..


కమలేష్ తివారీ హిందూ సమాజ్ పార్టీ నాయకుడు, వ్యవస్థాపకుడు. 2017లో సొంత పార్టీ పెట్టుకున్నారు. మహ్మద్ పంగ్బర్ కోసం కమలేష్ తివారీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. వివాదం తీవ్రరూపం దాల్చడంతో తివారీని కూడా అరెస్టు చేసినా తర్వాత విడుదల చేశారు. అక్టోబర్ 18, 2019న తివారీ లక్నోలోని తన కార్యాలయంలో ఉండగా... కుంకుమ రంగు కుర్తాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఫరీద్-ఉద్-దిన్ షేక్, అష్ఫాక్ షేక్ అతనికి స్వీట్లు ఇవ్వడానికి వచ్చారు. ఈ సమయంలో తివారీ సహోద్యోగి సిగరెట్లు తీసుకు రావడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి తివారీ గొంతు కోసి ఉండటాన్ని చూశారు. అతడిని ఆసుపత్రికి తరలించగా..  తివారీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. స్వీట్ల పెట్టెపై గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ స్వీట్ షాప్ చిరునామా రాసి ఉంది. పెట్టెలో రివాల్వర్, కత్తి లభ్యమయ్యాయి.


గోవింద్ పన్సారే.. 


2015 ఫిబ్రవరి 16న సీపీఐ నేత గోవింద్ పన్సారే, ఆయన భార్య ఉమ తమ సొసైటీలో మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. పన్సారే, ఆయన భార్య గాయపడ్డారు. ఇద్దరినీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని ఆస్టర్ ఆధార్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  అక్కడ ఆయన భార్య కోమాలోకి వెళ్లింది. 2015 ఫిబ్రవరి 20న పన్సారేని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన భార్య అదే ఏడాది మార్చి 4వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. మొబైల్ రిపేర్ షాప్ నిర్వహిస్తున్న సనాతన్ సంస్థ గ్రూప్ సభ్యుడు సమీర్ గైక్వాడ్ సహా ఐదుగురు వ్యక్తులు పన్సారేను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.


ప్రమోద్ మహాజన్..


22 ఏప్రిల్ 2006 ఉదయం మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్‌ను ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తన తమ్ముడు ప్రవీణ్ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చాడు. ఆయనపైకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన మహాజన్‌ని హిందూజా ఆసుపత్రిలో చేర్చారు. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. ఆయన 3 మే 2016న గుండెపోటుతో మరణించాడు. షూటర్ ప్రవీణ్ మహాజన్ పోలీసులకు లొంగిపోయాడు. తన సోదరుడు తనను అవమానించాడని, తనకు హక్కులు ఇవ్వలేదని ఆరోపించారు. 18 డిసెంబర్ 2007న ప్రవీణ్‌కి జీవిత ఖైదు విధించారు. ప్రవీణ్ పెరోల్ లో ఉండగానే  బ్రెయిన్ హెమరేజ్ కారణంగా 3 మార్చి 2010న మరణించాడు.


కృష్ణానంద రాయ్..


2005 నవంబర్ 29న బీజేపీ నాయకుడు కృష్ణానంద్ రాయ్ తన స్వగ్రామంలో ఒక కుటుంబ వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా కాల్చి చంపారు. మార్గమధ్యలో దుండగులు వారిపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. ముఖ్తార్ అన్సారీ, అఫ్జల్ అన్సారీ సహా ఎనిమిది మందిపై కృష్ణానంద్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అన్సారీ హత్యకు ఆదేశించారని ఆరోపించారు. అఫ్రోజ్ అలియాస్ చున్ను పెహల్వాన్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ జూన్ 2014లో అరెస్టు చేశారు.


హరేన్ పాండ్యా..


2003 మార్చి 26న అప్పటి గుజరాత్ హోం మంత్రి హిరేన్ పాండ్యా అహ్మదాబాద్‌లోని లా గార్డెన్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కారులో మృతదేహం లభ్యమైంది. మృతదేహం రెండు గంటల పాటు కారులో పడి ఉంది. 2007లో ప్రత్యేక పోటా కోర్టు హైదరాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు అస్గర్ అలీకి జీవిత ఖైదు, మరో ఏడుగురికి జీవిత ఖైదు, ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వీహెచ్‌పీ నేత జగదీష్ తివారీపై హత్యాయత్నం ఆరోపణలు వచ్చాయి. 29 ఆగస్టు 2011న, మొత్తం 12 మంది దోషులను గుజరాత్ హైకోర్టు దోషులుగా నిర్ధారించింది.