North Korea Crime news: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్ ఉన్ క్రూరత్వం, సైకోయిజం గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అయితే తాజాగా కిమ్ గురించి షాకింగ్ విషయం బయటపడింది. ఇద్దరు హైస్కూల్‌ విద్యార్థులకు కిమ్ జోంగ్ ఉన్ మరణశిక్ష విధించారు. వారిని ప్రజల మధ్యే పోలీసులు కాల్చి చంపారు.


ఇందుకే!


ఉత్తర కొరియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ర్యాంగ్‌ రాంగ్‌ ప్రావిన్స్‌కు వెళ్లారు. అక్కడ దక్షిణ కొరియా దేశానికి చెందిన సినమాలను, అమెరికన్‌ నాటకాన్ని చూశారు. వీటిని తోటి విద్యార్థులకు షేర్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కిమ్ జోంగ్ ఉన్.. ఆగ్రహంతో ఊగిపోయారట.


ఆ విద్యార్థులిద్దరినీ ప్రజల మధ్య కాల్చి చంపాలని కిమ్‌ జోంగ్‌ ఉన్.. పోలీసులను ఆదేశించారు. ఈ ఇద్దరు విద్యార్థులు 15-16 ఏళ్ల వయసు వారే. వీరిద్దర్నీ హెసాన్‌ నగరంలో జనం చూస్తుండగానే బహిరంగంగా పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన అక్టోబర్‌ నెలలో జరగ్గా, ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని బ్రిటిష్‌ పత్రిక ది ఇండిపెండెంట్‌ తన కథనంలో తెలిపింది. 


ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఉత్తర కొరియా ప్రజలు.. దక్షిణ కొరియాలో జరిగే షోలు, సినిమాలను చూడలేకపోతున్నారు. 


గతంలో


కిమ్ జోంగ్ ఉన్ ఇలాంటి వివాదాస్పద ఆదేశాలు ఇవ్వడం కొత్తేం కాదు. తన దేశాన్ని నరకంగా మార్చిన ఘనత కిమ్‌కే దక్కుతుంది. ఎందుకంటే.. నరకంలో కూడా ఉండనన్ని శిక్షలను అక్కడే అమలు చేస్తారు. ఆ దేశంలో తనకంటే ఎవరూ రిచ్‌గా ఉండకూడదనేది కిమ్ అభిమతం. అక్కడి ప్రజలు కరువుకాటకాలతో అల్లాడుతూ ఆకలి చావులు చస్తున్నా.. ఆ నియంత మనసు కరగడం లేదు. పైగా.. కొత్త రూల్స్‌తో ప్రజల  స్వేచ్ఛను మరింత హరిస్తున్నాడు. కిమ్ గతంలో ప్రవేశపెట్టిన ఓ రూల్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. 


కిమ్.. స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనని తాను దేవుడగా భావించే కిమ్.. తన ప్రజలు తమకు నచ్చిన విధంగా ఉండేందుకు ఇష్టపడడు. చివరికి హెయిర్ స్టైల్ విషయంలో కూడా ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. అక్కడి స్త్రీ, పురుషులు ప్రభుత్వం ఆమోదించిన 28 రకాల హెయిర్ స్టైల్స్‌లో మాత్రమే జుట్టు కత్తిరించుకోవాలి. తేడా వస్తే.. అరెస్ట్ తప్పదు. కానీ ఇకపై ప్రజలెవరూ తన స్టైల్‌ను కాపీ కొట్టకూడదని ఇటీవల కిమ్ ఆదేశించాడు. 


కిమ్ .. ఎప్పుడూ లెదర్ జాకెట్‌ను ధరిస్తాడు. అది తన వైభోగానికి ప్రతీకగా భావిస్తాడు. కిమ్ స్టైల్‌ను మార్కెట్ చేసుకోవడం కోసం స్థానిక వస్త్ర పరిశ్రమలు చీప్ మెటీరియల్స్‌తో కిమ్ జాకెట్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. తక్కువ ధరలకే వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నాయి. దీంతో పేదలు సైతం వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి.. కిమ్‌ మండిపడ్డాడు. ఇకపై తన స్టైల్‌ను కాపీ కొట్టకూడదని ఆదేశాలు జారీ చేశాడు. తన లెదర్ జాకెట్ తరహా జాకెట్లపై నిషేదం విధించాడు. ఎవరైనా ఆ జాకెట్లలో కనిపిస్తే.. అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు ‘రేడియో ఫ్రీ ఆసియా’ సంస్థ వెల్లడించింది. పేదలు సైతం అలాంటి జాకెట్లు ధరిస్తూ.. కిమ్ జంగ్ ఉన్‌లా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే వాటిని బ్యాన్ చేశారని తెలిపింది.  


Also Read: Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో పేలుడు- ఐదుగురు మృతి