ఇండియాలో కూర్చుని అమెరికన్లను మోసం చేసే కథతో వచ్చిన సినిమా మోసగాళ్లు. ఆ సినిమా ఫ్లాప్ అయి ఉండవచ్చు కానీ..అందులో పాయింట్ మాత్రం నేరగాళ్లకు సూపర్ హిట్ ఫార్ములాగా మారింది. ఆ సినిమాను రియల్‌గా జరిగిన మోసం ఆధారంగానే తీశారు. కానీ అలాంటి మోసాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముఠా చేస్తున్న పని ఇదే. ఢిల్లీలో కూర్చుని అమెరికన్లకు ఫోన్ చేసి ఫ్రాడ్ చేస్తున్నారు. కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. వీరు మోసం చేస్తున్న విధానం చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే.


అమెరికాలో ఉన్న వారిని ఆన్ లైన్ ద్వారా కొంత మంది పలకరిస్తారు. ఆన్ లైన్ చాటింగ్ సైట్లు.. ఈ మెయిల్స్ ద్వారా ఈ పలకరింపులు ఉంటాయి. వారిని మాటల్లో పెట్టి.. వారి కంప్యూటర్లలోకి బగ్‌లు ప్రవేశ పెడతారు. ఆ కంప్యూటర్లను పని చేయకుండా చేస్తారు. తర్వాత ఏమీ తెలియనట్లుగా.. వారే అదే అమెరికన్ సిటిజన్లకు ఫోన్ చేస్తారు. మీ కంప్యూటర్ లో బగ్స్ ఉన్నాయని గుర్తించామని..  ఇప్పుడు ఆ బగ్స్ తొలగించాలంటే..  కొంత మొత్తం పే చేయాల్సి ఉంటుందని చెబుతారు. అప్పటికే కంప్యూటర్ పని చేయడం మానేయడంతో... ఆ వ్యక్తి డబ్బులు చెల్లించడానికి అంగీకరిస్తాడు. డబ్బులు చెల్లించిన తర్వాత తాము పెట్టిన బగ్స్‌ను రిమూవ్ చేస్తారు. దీంతో ఆ వ్యక్తి తాను మోసపోయాను కానీ.. ఇలా ఫోన్ చేసిన వ్యక్తే  మోసం చేశాడని తెలుసుకోలేరు. 


ఈ తరహా స్కాం కోసం ఢిల్లీలో స్కామ్‌స్టర్లు ఏకంగా కాల్ సెంటర్ పెట్టేశారు. అక్కడ 32 మంది ఉద్యోగుల్ని కూడా పెట్టారు. వారి పని రోజూ అమెరికన్లను మోసం చేయడమే. రోజూ అమెరికన్లతో చాట్ చేయడం.. వారి కంప్యూటర్లలోకి బగ్స్‌ను ప్రవేశ పెట్టడం.. మళ్లీ డబ్బులు తీసుకుని వాటిని రిమూవ్ చేయడం.. ఇదే బిజినెస్. అమెరికా నుంచి ఫిర్యాదులు రావడంతో.. ఢిల్లీ పోలీసులు ఈ రాకెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బిస్రాక్ ప్రాంతంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న  ఆఫీసుపై దాడి చేసి..పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. బగ్స్‌ను ప్రవేశ పెట్టి ఒక్కో అమెరికన్ దగ్గర వెయ్యి డాలర్లు అంటే రూ. 74వేల వరకూ వసూలు చేసేవారని పోలీసులు ప్రకటించారు. 


కాల్ సెంటర్ ద్వారా ఒక్క రోజుకు నాలుగు వేల డాలర్ల వరకూ లాభం సంపాదిస్తున్నారు. ఏడాది నుంచి అమెరికన్లను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అక్కడ కాల్స్ చేసే వారికి నెలకు రూ. ఇరవై వేలు..మేనేజర్‌కి లక్షన్నర చెల్లిస్తున్నారు. అంటే.. సైబర్ నేరాలను కూడా కుటీర పరిశ్రమగా చేసుకుని.. అక్కడ వ్యాపారం చేస్తున్నారన్నమాట. వీరి తెలివి తేటల్ని చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.