Nara Lokesh : కర్నూలులోని కొండారెడ్డి బురుజు జనసంద్రంగా మారింది. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా తెలుగుదేశం నేతలు, శ్రేణులు తరలి వచ్చారు. వారి రాకతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. లోకేష్‌ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల గురించి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు వింటూ అందరితో ఫోటోలు దిగారు లోకేష్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు. 


టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు లోకేశ్. యువగళం పాదయాత్ర 93వ రోజు కర్నూలులో సాగుతోంది. సోమవారం ఉదయం ఎస్టీబీసీ గ్రౌండ్ గెస్ట్ హౌజ్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు పాదయాత్ర చేరుకోగా.. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయనను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరి తాము మాట మార్చమని, మడమ తిప్పే బ్యాచ్ కాదని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న లోకేశ్ హామీపై న్యాయవాదులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 










ఇన్కంట్యాక్స్ ఆఫీసు సర్కిల్, మున్సిపల్ ఆఫీస్, శ్రీలక్ష్మీ స్కూల్‌ జంక్షన్, కొత్తపేట, జిల్లా కోర్టు, కొండారెడ్డి బురుజు, అంబేద్కర్ సర్కిల్, పెద్ద మార్కెట్ మీదుగా పాదయాత్ర సాగుతుందీ యాత్ర. చిన్నమ్మ వారిశాల వైశ్యులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం మండీ బజార్, కుబూసూరత్ మసీదు, దర్వేష్ ఖాద్రి దర్గా మీదుగా ఉస్మానియా కాలేజ్ గ్రౌండ్ వరకు పాదయాత్ర సాగుతుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు. విరామం తర్వాత సాయంత్రం ఉమర్ అరబిక్ స్కూలు, బుధవారపేట, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, కాళికామాత ఆలయం, కుమ్మరిగేరి, నిమిషాంబ ఆలయం, జోహారాపురం మీదుగా పుల్లయ్య కళాశాల వరకు పాదయాత్ర సాగుతుంది. ఆ తర్వాత కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో బస చేస్తారు.