Bajrang Dal attack on Muslim Youth: 


కలిసి ప్రయాణించాడని...


హిందూ మతానికి చెందిన యువతితో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు ఓ ముస్లిం యువకుడిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఆ యువకుడిని భజరంగ్ దళ్ కార్యకర్తలు బాగా కొట్టినట్టు పోలీసులు వెల్లడించారు. మంగళూరులోని నతుర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. "భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ యువకుడిని వేధించారు. దాడి చేశారు. ఓ ప్రైవేట్ బస్‌లో హిందూ యువతితో ప్రయాణం చేస్తున్నాడన్న కారణంతో ఇబ్బంది పెట్టారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు  తీసుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జులైలోనూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ దళితుడిపై దాడి చేశారు. వ్యవసాయ పనుల కోసం ఓ ఆవుని వాహనంలో తీసుకెళ్తుండగా అడ్డగించి దాడి చేశారు. ఈ దాడిలో 40 ఏళ్ల మంజునాథ్ గాయాల పాలయ్యాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్ కింద నిందితులపై కేసు నమోదు చేశారు. 






ఎన్నో ఘటనలు..


కర్ణాటకలో నిత్యం ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక శివమొగ్గలో బజరంగ్ దళ్ కార్యకర్తను కొంత మంది యువకులు కలిసి హత్య చేశారు. వారిని మహ్మద్​ ఖాసిఫ్​, సయ్యద్​ నదీమ్​, అసిఫుల్లా ఖాన్​, రేహాన్​ షరీఫ్​, నిహాన్​, అబ్దుల్​ అఫ్నాన్​గా గుర్తించారు. శివమొగ్గలోని ఆదివారం రాత్రి కారులో వచ్చిన పలువురు దుండగులు బజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్షను కత్తితో పొడిచి హత్యచేశారు. గతంలో ఓ సారి భజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ దేవతలను అవమానించే రీతిలో చిత్రాలు ఉన్నాయనే కారణంతో కామసూత్ర పుస్తకాలను తగలబెట్టిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌కి చెందిన బజ్‌రంగ్ దళ్ నేతలు ఒక బుక్ స్టోర్ ఎదుట ఈ పుస్తకాలను కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కామసూత్ర పుస్తకంలో ఉన్న ఫొటోలు అసభ్యకర రీతిలో ఉన్నాయని.. అవి హిందూ దేవతల రూపాలతో పోలి ఉన్నాయని బజ్‌రంగ్ దళ్ నేతలు ఆరోపించారు. ఈ కారణంగానే వీటిని తగలబెట్టినట్లు చెప్పారు. ఈ పుస్తకాలను మరోసారి అమ్మితే దుకాణాన్ని కూడా తగలబెట్టేందుకు వెనకాడబోమని షాపు యజమానిని హెచ్చరించారు. కామసూత్ర పుస్తకంలో అసభ్యకర రీతిలో ఉన్న ఫోజులను (ఫొటోలు) బజ్‌రంగ్ దళ్ నేతలు తమ వీడియోలో చూపించారు. ఇవి హిందూ దేవతలను పోలి ఉన్నాయని ఆరోపించారు. అనంతరం ఈ పుస్తకాలన్నింటినీ దుకాణం బయట కుప్పగా పోసి తగలబెట్టారు. హర్ హర్ మహదేవ్, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ పుస్తకాలను తగలబెట్టినట్లుగా వీడియోలో ఉంది. 


Also Read: MCD Polls 2022: బీజేపీ వీడియోలా, ఆప్ హామీలా? ఏవి గెలుస్తాయో ప్రజలే నిర్ణయిస్తారు - కేజ్రీవాల్