నమ్మిన వారే మోసం చేస్తారనుకోలేదు: థాక్రే 


మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే సీఎ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే భాజపా రంగంలోకి దిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏక్‌నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతోంది. కీలక పదవి కట్టబెడుతుందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "శివసేన అధికారం కోసం పుట్టలేదు. అధికారమే శివసేన కోసం పుట్టింది. బాలాసాహెబ్ థాక్రే నమ్మిన సిద్ధాంతమిదే" అని అన్నారు సంజయ్ రౌత్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక, ఉద్దవ్ థాక్రే భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పని చేశామని, నమ్మిన వారే ఇలా మోసం చేస్తారని అనుకోలేదని అన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసినందుకు థాక్రేకు ఎలాంటి రిగ్రెట్ లేదని ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు. 


నంబర్ గేమ్స్ నాకు నచ్చవు: థాక్రే 


లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు థాక్రే ప్రకటించారు. రెబల్ నేతలు ముంబయికి వచ్చిన సమయంలో పార్టీ కార్యకర్తలెవరూ వారిని ఇబ్బంది పెట్టకూడదని సూచించారు థాక్రే. బాలా సాహెబ్ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయంగా ఎదిగిన వాళ్లు, సొంత పార్టీ నేతకే వెన్నుపోటు పొడవటాన్ని ఆనందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను అలా ఆనందించనివ్వండి అంటూ కార్యకర్తలకు చెప్పారు. నంబర్స్‌ గేమ్‌లోకి అడుగు పెట్టటం ఇష్టం లేదని, పార్టీలో ఏ ఒక్క నేత తనకు ఎదురు తిరిగినా అది తీరని అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. అటు సంజయ్ రౌత్ కూడా పార్టీ కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా ఉండేందుకు బూస్టప్ ఇస్తున్నారు. "పని చేస్తాం,మళ్లీ అధికారంలోకి వస్తాం" అని ధైర్యం నూరిపోస్తున్నారు.
 
ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజపా..


మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వెనక భాజపా ఉందని మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేసేలాగే ఉంది భాజపా నేతల తీరు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన ఈ తరుణంలో...రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది భాజపా. దేవేంద్ర ఫడణవీస్‌ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేయటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.శివసేన నుంచి మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునేలా షిండేకు ప్లాన్ ఇచ్చింది భాజపాయే అన్నదీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.  రాష్ట్రంలోని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్-BMCపై ఆధిపత్యం సాధించేందుకూ భాజపా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ని సిద్ధం చేసింది. 


Also Read: TS SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి


Also Read: Pavitra Lokesh: పోలీసులకు కంప్లైంట్ చేసిన పవిత్రా లోకేష్