Gorantla Madhav :  పార్లమెంట్ జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి దూకి కలర్ స్మోక్ ను విసిరిన దుండగుడి వ్యవహారం సంచలనం అవుతోంది. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత ఎంపీల సీట్ల ముందుగా జంప్ చేస్తూ.. హంగామా చేశాడుు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న కలర్ స్మోక్ తీసి బయటకు విసిరేశాడు. షాక్‌కు గురైన ఎంపీలు కొంత మంది వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. కానీ సభలోనే ఉన్న గోరంట్ మాధవ్ వెంటే ఆ దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్ది సేపు ప్రయత్నించిన తర్వాత ఆ నిందితుడ్ని పట్టుకున్నాడు. చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బంది కి అప్పగించారు. మాధవ్ ను సహచర ఎంపీలు అభినందించారు. 


మాధవ్ మాజీ పోలీసు అధికారి. సీఐగా సర్వీసులో ఉండాగనే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. పోటీ చేసిన మొదటి సారే ఎంపీగా ఎన్నికయ్యారు. వివాదాస్పద ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆయన ఈ సారి పార్లమెంట్ లో ధైర్య సాహసాలు చూపి అందర్నీ ఆకట్టుకున్నారు.  





 


మధ్యాహ్నం 1.02 గంటలకు ఒక వ్యక్తి విజిటర్ గ్యాలరీ నుంచి దూకి ఛాంబర్ లోకి పరిగెత్తడంతో లోక్‌సభలో గందరగోళం తలెత్తింది. ఇద్దరు వ్యక్తులు ఎల్లో కలర్ పొగను వెదజల్లారు. ఒక వ్యక్తిని పట్టుకునేందుకు ఎంపీలు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు దుండగుడు డెస్కులపై నుంచి దూకాడు. ప్రతిపక్ష ఎంపీలు భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిందించారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ వెలుపల మరో ఇద్దరు ఇలాగే పొగలు వెదజల్లుతూ నిరసన తెలిపారు. దుండగులను అమోల్ షిండే(25), నీలం(42)గా గుర్తించారు.                      


భద్రత ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. ఈ రోజు డిసెంబర్ 13, 2001 రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించాము, ఈ దాడి జరిగిన రోజే మరో ఘటన చోటు చేసుకుందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోలేదా..? అంటూ ఆయన ప్రశ్నించారు. మా ఎంపీలు నిర్భయంగా వారిని పట్టుకునేందుకు చూశారన్నది నిజం, అయితే మన పార్లమెంట్ భద్రతా సిబ్బంది ఎక్కడ ఉన్నారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.