Monsoon News: ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు భారతదేశంలో 80 శాతానికి చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా విస్తరించాయని చెప్పింది. రుతుపవనాలు ఆదివారం ఒకే రోజు ఢిల్లీ, ముంబైకి చేరుకున్నాయి. 62 ఏళ్ల తర్వాత ఇది జరిగిందని ఐఎండీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముంబయిలో రెండు వారాలు ఆలస్యంగా, ఢిల్లీలో రెండు రోజుల ముందుగా నైరుతి రుతు పవనాలు ప్రవేశించడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని వివరించారు. అయితే దీనిని నేరుగా వాతావరణ మార్పులతో ముడి పెట్టలేమని.. కాబట్టి దీన్ని గుర్తించడానికి 30 నుంచి 40 సంవత్సరాల డేటాను చూడాల్సి వస్తుందని చెప్పారు. రుతుపవనాలు ఈ ఏడాది కొత్త తరహాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి.


గాలులు మరింత పెరగడానికి కారణాలు ఇవే..!


"సాధారణంగా, రుతుపవనాలు అల్పపీడనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అల్పపీడన వల్ల ఏర్పడే గాలుల కారణంగా విస్తారంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి. దీని వల్ల వర్షం కురిసింది" అని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ వెల్లడించారు. అరేబియా సముద్రం నుంచి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈటైంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ గాలులు మరింత పెరిగాయన్నారు. దీని ఫలితంగా ముంబైతో సహా మహారాష్ట్రలో వర్షాలు కురిశాయని, అదే సమయంలో అల్పపీడన ప్రభావం ఢిల్లీ సహా వాయువ్య భారతదేశం వైపు విస్తరించింది. ఫలితంగా గాలులు వీచాయి. ఇలా ఈసారి రుతుపవనాలు రెండు ప్రాంతాలను ఒకేసారి కవర్ చేసింది. అసోంపై మేఘాలు కమ్ముకున్నాయని, అయితే అక్కడ చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదని ఐఎండీ అంచనా వేస్తోంది. 


హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..


నైరుతి రుతుపవనాల కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేశంలోని చాలా ప్రాంతాల్లో వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు ఇది కొనసాగనుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాను ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. 200 మందికిపైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. కులులో అనేక వాహనాలు కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ఛత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. 


తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు


 రుతుపవనాలు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు  ఈ రెండు రోజులు కొన్ని చోట్ల ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో  కూడిన వర్షములు  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.  ఈ రోజు భారీ వర్షాలు రాష్ట్రంలో ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ  వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


ఏపీలో చూసుకుంటే... ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.