Monsoon News: ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్ నెలలోనూ ఎక్కువగా వర్షాలు కరిసే అవకాశం లేదిన ఇప్పటికే ఆగస్టు నెలంతా వాతావరణం పొడిగానే ఉందంటూ వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో దేశంలో ఈ ఏడాది జూన్ లో లోటు వర్షపాతం నమోదు అయింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు అయింది. జులైలో 489.9 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు కాగా... లోటు తీరినట్లు అయింది. సాధారణ సగటు కంటే జూన్ లో తొమ్మిది శాతం తక్కువ లోటు ఉండగా... జులైలో 13 శాతం ఎక్కువగా నమోదు అయింది. మరోవైపు సెప్టెంబర్ లో 17 నుంచి రుతుపవనాల తిరోగమనం ప్రారంభంకానుంది.

  


రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కారణంగా గత నాలుగేళ్లుగా సెప్టెంబర్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతున్నప్పటికీ... తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్షిక సగట వర్షాపాతంలో 70 శాతం రుతుపవనాల సమయంలోనే నమోదు అవుతున్నాయి. వర్షాపాతం తగ్గితే నిత్యావసర చక్కెర, పప్పులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


50 ఏళ్ల తర్వాత ఆగస్టులో అత్యల్ప వర్షపాతం


రాష్ట్రంలో 1972 తర్వాత ఆగస్టు నెలలో అత్యల్ప వర్షపాతం నమోదు అయింది. ఆగస్టులో కేవలం 74.4 మిల్లీ మీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదు కాగా.. ఇది సాధారణం కంటే 60 శాతం తక్కువ. 1960 నుంచి రాష్ట్రంలో ఇంత తక్కువగా వర్షాపాతం నమోదు అవడం ఇది మూడోసారి. 1960లో 67.9 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదు కాగా.. 1968లో 42.7 మిల్లీ మీటర్లు, 1972లో 83.2 మిల్లీ మీటర్లు, ప్రస్తుతం ఆగస్టులో 74.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. సాధారణంగా తెలంగాణలో 120 రోజులు వర్షాకాలం ఉంటుందని 60 నుంచి 70 రోజులు మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్ లో లోటు ఏర్పడిందని, జులైలో మంచి వర్షాలు కురిసినా.. ఆగస్టులో వరుణుడు ముఖం చాటేశాడు. లోటు వర్షపాతానికి ఎల్ నినో ప్రధాన కారణం అని నిపుణులు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.  


తెలుగు రాష్ట్రాల్లో నేడు పొడి వాతావరణం


ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ/వాయువ్య  దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (ఆగస్టు 28) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ, వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.1 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 75 శాతంగా నమోదైంది.