భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం పంపించిన ఆదిత్య L1 విజయవంతంగా లాంఛ్ అవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. చంద్రయాన్‌ -3 విజయవంతం తర్వాత భారత్‌ అంతరిక్ష ప్రయోగాల జర్నీ కొనసాగుతోందని మోదీ ట్వీట్‌ చేశారు. భారత తొలి సోలార్‌ మిషన్‌ను విజయవంతంగా లాంఛ్ చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఆయన అభినందనలు తెలిపారు. మొత్తం మానవాళి సంక్షేమం కోసం విశ్వం గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు శాస్త్రీయ పరిశోధనలు నిరంతరాయంగా కొనసాగిస్తామని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


ఆదిత్య L1 ఈరోజు ఉదయం 11.50 నిమిషాలకు లాంఛ్ అయ్యింది. పీఎస్‌ఎల్వీ స్స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయి తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ప్రకటించింది. సూర్యుడిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసే లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ సోలార్‌ మిషన్‌ ద్వారా పంపించిన ఆదిత్య L1 సూర్యుడికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్య వలయం లగ్రాంజ్‌ పాయింట్‌-1 లోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. అక్కడికి చేరుకున్న తర్వాత ఈ ఉపగ్రహం అందులోని వీఈఎల్‌సీ సాయంతో ఫొటోలు పంపనుంది. రోజుకు 1440 ఫొటోలు పంపుతుందని ఇస్రో తెలిపింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఉపగ్రహం లగ్రాంజ్‌ పాయింట్‌ను చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రయాన్‌ 3 ప్రయోగం మాదిరిగానే.. ఈ సోలార్‌ మిషన్‌లోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.


లగ్రాంజ్‌ పాయింట్‌ నుంచి సూర్యుడి చుట్టు ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుంది. అయితే చంద్రయాన్‌ 3 లో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఎంత సవాళ్లతో కూడుకున్నదో.. ఇక్కడ ఆదిత్య L1 ను ట్రాజెక్టరీలోకి చేర్చడం అంతే కష్టమైన పని. దశల వారీగా లగ్రాంజ్‌ పాయింట్‌ 1 కు చేరుకోవాల్సి ఉంటుంది.  చంద్రయాన్‌ 3 మిషన్‌ సక్సెస్‌తో ఎంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో ఈ సోలార్‌ మిషన్‌ కూడా విజయవంతం అవుతుందని ధీమాతో ఉంది. ఆదిత్య L1 విజయవంతంగా లగ్రాంజ్‌ పాయింట్‌కు చేరుకుంటే.. ఆ పాయింట్‌కు వెళ్లిన రెండో ఉపగ్రహం అవుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ పాయింట్‌కి గతంలో ఉపగ్రహాన్ని పంపింది.