Telangana Government : తెలంగాణలో పౌరసరఫరాల శాఖ ( Civil supplies Dept)పై  ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలకుల  నిర్లక్ష్యంతో పౌరసరఫరాల శాఖలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌ ( Hyderabad)లో తొలిసారి పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష(Review) నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరించారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆయన, ప్రస్తుతం 56వేల కోట్ల అప్పుల్లో ఈ శాఖ ఉందన్నారు. 


కిలో బియ్యాన్ని 39 రూపాయలకు సేకరిస్తున్నాం


12 శాతం మంది వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించలేదని, రేషన్‌ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించినట్లు తెలిపారు. కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి, ప్రజలకు అవినీతిలేని పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోందన్న ఆయన, రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలన్నారు. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిందని, బియ్యం తీసుకునే లబ్ధిదారులు రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. వడ్ల కొనుగోలుకు సివిల్‌ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలని, రైతులకు డబ్బు వెంటనే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలని, కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.  అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందన్నారు.


వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నిక


హుజుర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎన్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1982-1991 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా, మిగ్ 21, మిగ్ 23లను ఫ్రంట్ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్‌ గా పని చేశారు. రాష్ట్రపతి భవన్‌లో భద్రత , ప్రోటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌ గానూ సేవలు అందించారు.  1999, 2004లో కోదాడ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన ఆయన, 2009లో హుజుర్ నగర్ నియోజకవర్గానికి మారిపోయారు. 2009, 2014, 2018లో హుజుర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది...హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా  పోటీ చేసి గెలుపొందారు. 2019లో హుజుర్‌ నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ నుంచి అసెంబ్లీకి  ఎన్నికయ్యారు. 1999-2023 వరకు ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2015- 2021 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన... కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు.