Mexico shooting: మెక్సికో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ బార్‌లో దుండగుడు చేసిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.




ఇదీ జరిగింది


గ్వానాజువాటోలోని ఇరాపువాటోలోని ఓ బార్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఓ సాయుధుడు బార్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశాడు. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు.


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. గత నెల రోజుల్లో మెక్సికోలో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోది.


ఇటీవల


మెక్సికోలో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్‌లోకి ఆయుధాలతో ప్రవేశించిన దుండగులు విచ్చలవిడిగా కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


ప్రాణాలు కోల్పోయిన వారిలో పట్టణ మేయర్ కాన్రాడో మెండోజా, ఆయన తండ్రి జువాన్ కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు దిగిన దుండగులు 'లాస్ టెకిలెరోస్' డ్రగ్స్‌ ముఠాకు చెందినవారిగా భద్రతా అధికారులు భావిస్తున్నారు. 


తుపాకీల మోత


మెక్సికోలో ఎక్కువ హింస జరిగే ప్రాంతాల్లో మిచోవాకాన్ ఒకటి. ఇక్కడ రెండు వర్గాలు నిత్యం కాల్పులు జరుపుకొంటూ ఉంటాయి. కాల్పుల్లో ప్రతి ఏటా వందల మంది మరణిస్తుంటారు.


డ్ర‌గ్ ట్రాఫికింగ్ స‌హా ప‌లు చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డే ప్ర‌త్య‌ర్ధి ముఠాల మ‌ధ్య త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తుతుంటాయి. 2006లో కేంద్ర బ‌ల‌గాల‌తో ప్ర‌భుత్వం యాంటీ డ్ర‌గ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి మెక్సికో డ్ర‌గ్ సిండికేట్ మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. 2006 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 3,40,000 మందికి పైగా మరణించారు.


ముఠాల వార్


మార్చి మొదటి వారంలో ఓ దుండగుడు ఇలానే కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 17 మంది వరకు మరణించారు. ఇక్కడ ఇలా ముఠా తగాదాలు, కాల్పులు ప్రజలకు అలవాటైపోయాయి. పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇలా కాల్పులు జరిగిన ప్రతిసారి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


Also Read: Pakistan PM on Biden: 'మాది బాధ్యత గల దేశం'- జో బైడెన్‌ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని