లాక్‌డౌన్ వల్ల ఎన్నో జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పటికీ ఆ చేదు రోజుల నుంచి బయటపడలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు. ఉద్యోగం లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక నిద్రలేని రాత్రులు గడిపాడు. ‘‘ఇక నా జీవితం ఇంతేనా..’’ అనుకొనే సమయానికి ఊహించని విధంగా లక్ కలిసి వచ్చింది. రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 


కరోనా వైరస్ వల్ల అతడు (పేరు వెల్లడించలేదు) అతడు పనిచేస్తున్న కంపెనీ మూతపడింది. దీంతో అతడు ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించడం కోసం ఓ చోట క్లీనర్‌గా చేరాడు. అతడి కుటుంబానికి రోజు గడవడమే కష్టంగా మారింది. అయితే, తన లక్ పరీక్షించుకోవడం కోసం లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. అయితే, ఏ రోజు అతడికి లక్ కలిసి రాలేదు. ఇక వాటికి డబ్బులు ఖర్చుపెట్టడం దండగ అని భావిస్తున్న తరుణంలో ‘పవర్ బాల్’ లాటరీ 80 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.437 కోట్లు) బహుమతి ప్రకటిస్తూ టికెట్లు విక్రయించింది. దీంతో అతడు కూడా టికెట్ కొనుగోలు చేశాడు. 


ఆ టికెట్‌ను కేవలం అతడు మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలోని సుమారు పది లక్షల మందికి పైగా కొనుగోలు చేశారు. దీంతో అతడు దాదాపు నమ్మకాన్ని కోల్పోయాడు. అయితే, ఆగస్టు 12 రాత్రి ప్రకటించిన ఫలితాల్లతో అతడే విజేతగా నిలిచాడు. ఒకటి.. కాదు రెండు కాదు.. ఏకంగా రూ.437 కోట్లు అతడిని వరించాయి. అది నిజమా కాదా అని తెలుసుకొనేందుకు అతడు తన లాటరీ టికెట్ నెంబర్లను పదే పదే చెక్ చేసుకున్నాడు. మొత్తానికి తానే విజేత అని తెలుసుకున్నాడు. లాటరీ వరించిన తర్వాత కూడా అతడు నిద్రలేని రాత్రి గడిపాడు. ఈ సారి బాధతో మాత్రం కాదు.. సంతోషంతో.


 తన జీవితం ఇలా మలుపు తిరుగుతుందని ఏ రోజూ ఊహించలేదని అతడు తెలిపాడు. ఈ మొత్తంతో రుణాలు మొత్తం చెల్లించేస్తానని, తనలా డబ్బులు లేక కష్టపడుతున్న వ్యక్తులకు సాయం చేస్తానని పేర్కొన్నాడు. ‘పవర్ బాల్’ జాక్‌పాట్‌ను మొదలుపెట్టిన గత పాతికేళ్లలో 80 మిలియన్ డాలర్లకు ప్రైజ్ మనీ చేరడం ఇది ఎనిమిదో సారి. విజేతతోపాటు మరో 13 మందికి రూ.7.75 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ లభించనుంది.  


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!