Maoist Links Case:


గృహనిర్బంధానికీ నిరాకరణ..


దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబాకు బాంబే హైకోర్టు ఊరటనిచ్చినా...సుప్రీం కోర్టు మాత్రం షాక్ ఇచ్చింది. ఆయన జైల్లోనే ఉండాలని తేల్చి చెప్పింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. ఈ కేసులో సాయిబాబా నుంచి వివరణ కోరింది. మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా...ఈ నిర్ణయం తీసుకుంది సర్వోన్నత న్యాయస్థానం. డిసెంబర్ 8వ తేదీన మరోసారి విచారణ చేపడతామని చెప్పింది. జస్టిస్ ఎమ్‌ ఆర్ షా, జస్టిస్ బేల ఎమ్ త్రివేదితో కూడిన ధర్మాసనం సాయిబాబా పిటిషన్‌నూ కొట్టివేసింది. తన ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని...జైల్లో కాకుండా గృహనిర్బంధం చేసేలా అనుమతి నివ్వాలని సాయిబాబా పిటిషన్ వేశారు. దీన్ని ధర్మానం తిరస్కరించింది. 90%  ఫిజికల్ డిసబిలిటీతో ఉన్నందున సాయిబాబాను గృహ నిర్బంధం చేసేందుకు అనుమతించాలని ఆయన తరపున న్యాయవాది బసంత్ వాదించారు. అయితే...ఆయన చేసిన నేర తీవ్రత ఎక్కువగా ఉన్నందున అందుకు అనుమతించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. 






ఇదీ కేసు..


మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న సాయిబాబాను నిర్దోషిగా తేల్చింది బాంబే హైకోర్టు. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో నాగ్‌పుర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా తేల్చింది. మరేదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా వీరందరినీ తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2014 మే నెలలో సాయిబాబా, ఓ జర్నలిస్టు, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సహా మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2017 మార్చిలో సెషన్స్‌ కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీరు నాగ్‌పుర్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జీవిత ఖైదును సవాల్‌ చేస్తూ సాయిబాబా సహా మిగతా దోషులు బాంబే హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు నాగ్‌పుర్‌ బెంచ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. వీరందరినీ నిర్దోషులుగా తేల్చుతూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాలు న్నాయనే కేసులో సాయిబాబా అరెస్ట్ కావడంతో దిల్లీ యూనివర్సిటీ ఆయనను సస్పెండ్‌ చేసింది. 2021లో ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు సాయిబాబా నిర్దోషిగా తేలడంతో ఆయన ఉద్యోగం సంగతి ఏంటనేది ప్రశార్థకంగా మారింది. మళ్లీ ఆయన్ను విధుల్లోకి తీసుకుంటారో లేదా చూడాలి.


Also Read: Turkey Blast: టర్కీలోని ఓ కోల్‌మైన్‌లో భారీ పేలుడు, 28 మందికిపైగా మృతి?