Mangaluru Auto Rickshaw Blast:


కీలక వివరాలు వెల్లడి..


మంగళూరులో ఆటో బ్లాస్ట్ కేస్‌కి సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ షరీక్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. షరీక్‌ నివాసమున్న ఇంట్లో నుంచి కొన్ని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 19వ తేదీన సాయంత్ర 7.40 నిముషాలకు ఓ ఆటోలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ పురుషోత్తమ్‌ పుజారిగా గుర్తించారు పోలీసులు. ఇక... అందులో ప్రయాణిస్తున్న వ్యక్తే నిందితుడు షరీక్ అని నిర్ధరించారు. ఇప్పటికే...నిందితుడిపై మూడు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రెండు కేసులు మంగళూరులో, మరో కేసు శివమొగ్గలో నమోదైంది. UAPA కింద రెండు కేసులు నమోదు కాగా...మూడో కేసుని "వాంటెడ్‌" కింద నమోదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఓ అడవిలో బాంబు పేలుడుకు సంబంధించిన ట్రయల్స్ చేసినట్టు తెలుస్తోంది. షరీక్‌తో పాటు మరో ఇద్దరు ఇందుకు సహకరించారని సమాచారం. ఈ ఘటన జరిగిన తరవాత నవంబర్ 20న మాజ్ మునీర్, సయ్యద్ యాసిన్‌ అనే ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. షరీక్...మైసూర్‌లో ఉంటూ బాంబుల తయారీ నేర్చుకున్నాడని, దొంగిలించిన ఓ ఆధార్ కార్డ్‌తో ఇల్లు అద్దెకు తీసుకున్నాడని పోలీసులు చెప్పారు. 


రంగంలోకి దర్యాప్తు సంస్థలు..


కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షా పేలుడు ఘటన సంచలనం రేపింది. ఇది ఉగ్రవాదుల పనా..? లేదంటే ఎవరైనా కావాలనే భయ భ్రాంతులకు గురి చేసేందుకు చేశారా..?" అన్నఅనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే..దీనిపై కర్ణాటక పోలీసులు వివరణ ఇచ్చారు. "ఈ పేలుడు అనుకోకుండా జరిగింది కాదు. కేవలం భారీగా ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఉగ్రవాద చర్య" అని వెల్లడించారు. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో పూర్తి స్థాయి విచారణ జరుపుతాం" అని తెలిపారు. కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా దీనిపై స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసులకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. " ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతానికి మాట్లాడే స్థితిలో లేడు. పోలీసులు వీలైనంత మేర సమాచారం సేకరిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఇది ఉగ్రవాద చర్య అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించాం. ఆ టీమ్‌లు మంగళూరుకు వెళ్తున్నాయి. మరో రెండ్రోజుల్లో పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుందని ఆశిస్తున్నాం" అని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఆటో రిక్షాలో ఓ ప్రెజర్ కుకర్‌ను స్వాధీనంచేసుకున్నారు. దీన్ని బ్యాటరీలతో పేల్చినట్టు తేలింది. 


Also Read: Budget 2023-24: 2023-24 బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ కసరత్తు, నిపుణులతో వరుస సమావేశాలు