Viral News in Telugu: మృత్యువు ఎప్పుడు ఎలా ఎవరిని వెంటాడుతుందో చెప్పలేం. అప్పటి వరకూ కళ్ల ముందే ఉన్న వ్యక్తి రెప్ప పాటులో ప్రాణాలు కోల్పోతాడు. ఢిల్లీలో ఇదే జరిగింది. ఓ ఇంటి బయట బైక్‌పై కూర్చుని ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న ఓ వ్యక్తిపై మృత్యువు ముంచుకొచ్చింది. రెండో అంతస్తు నుంచి ఏసీ ఒక్కసారిగా మీద పడింది. సరిగ్గా తలపైనే పడడం వల్ల తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని డోరివాలాలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాయంత్రం ఫ్రెండ్ ఇంటికి బైక్‌పైన వచ్చిన యువకుడు కాసేపు మాట్లాడాడు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు బైక్ స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్‌కి హగ్ ఇచ్చాడు. మరో క్షణంలో అక్కడి నుంచి వెళ్లిపోతాడనగా సరిగ్గా తల మీద ఏసీ పడిపోయింది. ఆ ధాటికి అక్కడే మృతి చెందాడు బాధితుడు. పక్కనే ఉన్న మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరినీ స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఒకరు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.