Morbi Bridge Collapse: 'వారిపైనేనా మీ ప్రతాపం- వంతెన కూలిన ఘటనపై సీబీఐ, ఈడీ చర్యలేవి?'

ABP Desam   |  Murali Krishna   |  02 Nov 2022 04:43 PM (IST)

Morbi Bridge Collapse: మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీం కోర్టు పరిధిలో జ్యుడీషియల్‌ కమిటీ వేసి విచారణ జరిపించాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

'వారిపైనేనా మీ ప్రతాపం- వంతెన కూలిన ఘటనపై సీబీఐ, ఈడీ చర్యలేవి?'

Morbi Bridge Collapse: గుజరాత్‌ మోర్బీలో కేబుల్‌ బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో 140 మందికిపైగా మృతి చెందారని, ఇందుకు బాధ్యులైన వారిపై ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దీదీ ప్రశ్నించారు.

మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనకు కారకులపై ఈడీ, సీబీఐ చర్యలు ఎందుకు చేపట్టలేదు.వాళ్లు కేవలం సామాన్యులపైనే తమ ప్రతాపం చూపిస్తారు. ప్రమాదం జరిగింది ప్రధాని సొంత రాష్ట్రంలో కనుకే నేను ఆయనను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నేను రాజీకీయాల గురించి ఏదీ మాట్లాడబోను. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ ఘటనపై నేను కామెంట్‌ చేయను. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పరిధిలో జ్యుడీషియల్‌ కమిటీ వేసి విచారణ జరిపించాలి.                                        -         మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

9 మంది అరెస్ట్

మోబ్రీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ప్రమాదానికి కారణమైన వాళ్లపై పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. సమగ్ర విచారణ కొనసాగుతోంది. మేనేజర్, సూపర్‌వైజర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఈ బ్రిడ్జ్‌కు సంబంధించిన సిబ్బంది అందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే ఓ అధికారి సంచలన విషయం వెల్లడించారు. ఈ వంతెనను మరమ్మతు చేయించాక ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితులు సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే ఈ వంతెనను ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న కంపెనీపైనా FIR నమోదు చేశారు పోలీసులు.

ఘోర ప్రమాదం

బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.

ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 140 మందికి పైగా మృతి చెందారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: Money Laundering Case: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు మళ్లీ నిరాశ- కస్టడీ పొడిగింపు!

Published at: 02 Nov 2022 04:43 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.