రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండు కావు. అలాగే ఒకటి మైనస్ ఒకటి కూడా ఎప్పుడూ సున్నా కాదు. అంటే  ప్రత్యర్థి ఎప్పుడూ శత్రువు కాదు. ఆ ప్రత్యర్థే గెలుపు అందించేవాడవుతాడు. ప్రస్తుతం దేశ రాజకీయాల‌్ని చూస్తే బీజేపీకి అలాంటి ప్రత్యర్థే మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్... అంటే ఎంఐఎం. హైదరాబాద్‌కే పరిమితమైన ఆ పార్టీ ఇటీవలి కాలంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. గెలుస్తున్న సీట్ల సంగతి పక్కన పెడితే బీజేపీకి అన్ని విధాలూగా మేలు చేస్తోంది. ఇప్పుడు ఎంఐఎం చీఫ్ గుజరాత్‌కు కూడా వెళ్లి అక్కడ కూడా పోటీ చేస్తామని ప్రకటించడంతో బీజేపీ -ఎంఐఎం మిత్రుత్వం లాంటి శత్రుత్వం మరోసారి హైలెట్ అవుతోంది.


గుజరాత్,యూపీల్లో పోటీ చేస్తామంటున్న ఓవైసీ  ! 


త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో యూపీ మీద అందరి దృష్టి ఉంది. ఆ తర్వాత గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. అవి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్‌కు చాలెంజ్. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో తాము పోటీ చేస్తామని మజ్లిస్ చీఫ్ ప్రకటించారు. స్వయంగా గుజరాత్‌లో పర్యటించారు. యూపీలోనూ తిరుగుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తూ వస్తోంది. మహారాష్ట్ర బరిలో నిలిచి ఔరంగాబాద్ లోక్‌సభ స్థానాన్ని, మరో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలిచారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ ఆ పార్టీకి ప్రయోజనం లేకపోయింది.


Also Read : మోదీ-బైడెన్ భేటీకి ముహూర్తం ఫిక్స్, క్వాడ్ దేశాల భేటీ కూడా.. వైట్ హౌస్ ప్రకటన


పైకి చెప్పే లక్ష్యం బీజేపీ ఓటమి - కానీ సాయం చేసేది బీజేపీ విజయానికే ! 


బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఓవైసీ చెబుతూంటారు. బీజేపీని బద్ద శత్రువుగా పరిగణిస్తూంంటారు. బీజేపీ కూడా అంతే. అందుకే బీజేపీని ఓడిస్తామని బరిలోకి దిగుతున్నామని చెబుతూంటుంది. కానీ ఆ పార్టీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి అంతిమంగా బీజేపీకి లాభిస్తోంది. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసిన అనేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాతో గెలుపొందారు. అక్కడ ఎంఐఎం పోటీతో జేడీయూ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు చీలిపోయాయి. ఈ కారణంగా బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మహారాష్ట్రాలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు భారీగా ఓడిపోవడంతో  ఎంఐఎం చీల్చిన ఓట్లే కీలకం., అక్కడ శివసేన కలవడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూపీలో  మజ్లిస్ పోటీ చేస్తే ముస్లిం ఓట్లు సమాజ్ వాదీ పార్టీ నుంచి చీలిపోతాయి. అది బీజేపీ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది.


Also Read : మళ్లీ మీ ముందుకు వచ్చేశా.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. ఐటీ దాడులపై సోనూసూద్
 
బీజేపీ ఓటమే లక్ష్యమైతే ఓవైసీ ప్లాన్ వేరే ఉంటుంది..!   


మతతత్వ బీజేపీని ఓడించడానికంటూ  బలం లేని రాష్ట్రాల్లో కేవలం ముస్లిం ఓట్లను చీల్చడానికి ఓవైసీ పోటీ చేయడం వివాదాస్పదం అవుతోంది. నిజంగా బీజేపీని ఓడించాలంటే ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకుని వారికి సహకరించాలి. కానీ మజ్లిస్ అలా ఎప్పుడూ చేయదు. సొంతంగా పోటీ చేసి ముస్లిం ఓట్లను చీలుస్తుంది. ముస్లింలు  ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి నష్టం ఉండదు. ఇతర ప్రత్యర్థుల ఓట్లే చీలుతాయి. ఇక్కడే ఓవైసీ బీజేపీని మద్దతిస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.


Also Read : ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సమరంలో ప్రియాంక గాంధీ.. సీఎం అభ్యర్థిగా ఫైనల్!


బీజేపీ - ఎంఐఎం ఒకరికి ఒకరు బలమే !


ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినా అమిత్ షా ఎంఐఎంను టార్గెట్ చేశారు. ఎంఐఎం కూడా బీజేపీనే టార్గెట్ చేసింది.  ఇద్దరూఇలా ఒకరి నొకరు రాజకీయంగా విమర్శించుకోవడం రెండు పార్టీలకు మేలు చేస్తుంది. హిందూ - ముస్లిం పోలరైజేషన్ జరుగుతుంది. ఆ తరహా రాజకీయంతోనే ప్రస్తుతం రెండు పార్టీలు శత్రువులైన మిత్రపక్షాలుగా ఉంటున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


Also Read : కేటీఆర్ పెద్దమనసు.. జీహెచ్ఎంసీ స్వీపర్‌ రజినికి ఉన్నత ఉద్యోగం, ఉత్తర్వులు జారీ


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి