కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైపోయింది. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ దెబ్బ నుంచి కోలుకోకముందే థర్డ్ వేవ్ వణికిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ కుదుటపడేదెప్పుడు?. ప్రభుత్వ ఖజానాకి మళ్లీ మునుపటి కళవచ్చేదెప్పుడు?  ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించే చర్యలకు పూనుకున్నాయి. దుబారా ఎక్కడవుతుందో గమనిస్తూ.. కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాలు మినహా.. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇస్తూ.. సగం జీతం ఇవ్వడానికి నిర్ణయించింది.  




కరోనా కష్టకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయంది. 2.53లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 30శాతం ఆదాయంలో కోతపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం ఎలాగా అని తలలు పట్టుకున్నారు అధికారులు. ఓవైపు నిరర్థక ఆస్తులను అమ్మే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా 500కోట్ల రూపాయలు సమీకరించారు. ఇంకా ఏదో చేయాలనుకుంటున్న అధికారులు ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు. ఉద్యోగం చేయకపోయినా సగం జీతం తీసుకునే పథకం ఇది. మూడేళ్లనుంచి ఐదేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా విధులకు హాజరు కాకుండా సగం జీతం తీసుకోవచ్చు. మిగతా సగం జీతాన్ని ప్రభుత్వం తన ఖాతాలో మిగుల్చుకుంటుందనమాట. ఇలా ఏటా 6వేల కోట్ల రూపాయలు ఆదా చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.




ఈ పథకానికి ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే అమలులోకి వస్తుంది. మధ్యప్రదేశ్‌లో అమలు చేయాలనుకుంటున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటున్నప్పటికి.. మన దేశంలో మాత్రం పనిలేకుండా సగం జీతం ఇవ్వడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. 




ఒక్క మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కాదు....దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. కరోనా కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగడం లేదు. షిప్టుల వారీగా కొందరు...రోజు తప్పించి రోజు కొందరు కార్యాలయాలకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో పని జరగకపోవడం ఓ కారణమైతే....పూర్తిస్థాయి జీతాలు చెల్లించడం మరింత భారంగా మారింది ప్రభుత్వాలకు. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భారీ చర్చ జరుగుతోంది. అటు ద్యోగులకు టెన్షన్ ఉండదు..పైగా పనిచేయకుండా సగం జీతం.  మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏఏ రాష్ట్రప్రభుత్వాలు ఫాలో అవుతాయో చూడాలి..