Lok Sabha Election 2024: 


స్టాలిన్ నుంచి పిలుపు..


2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. కీలక నేతలందరూ ఎవరికి వారు విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ పావులు కదుపుతున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలు ఢిల్లీలో స్టాలిన్ నేతృత్వంలో సమావేశం కానున్నారు.  All India Federation for Social Justiceలో భాగంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్న కీలక నేతలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే...వీలుని బట్టి ఆన్‌లైన్‌లోనే మీటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. స్టాలిన్ వీరందరికీ నేతృత్వం వహించనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరపున ఓ ఎంపీ హాజరు కానున్నారు. ఆప్‌ తరపున ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొంటారు. BRS తరపున ఎంపీ డాక్టర్ కేశవ రావు హాజరవనున్నారు. DMK నేతృత్వంలో ఇలా విపక్షాలు ఒక్కటవడం ఇది రెండోసారి. స్టాలిన్ 70వ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. విపక్షాలను ఒక్కటి చేసి బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేయాలని స్టాలిన్ ప్లాన్ చేస్తున్నారు. 


చేయి చేయి కలిపి..


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన తరవాత విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ నిర్ణయం సరికాదని గట్టిగానే వాదిస్తున్నాయి. ఇప్పుడీ పరిస్థితులనే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. విపక్షాల మధ్య మైత్రి పెంచాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని పార్టీలు విభేదాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నాయి. రాహుల్ అనర్హతా వేటుపై పార్లమెంట్‌లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి..? బీజేపీతో ఎలా పోరాడాలి..? అనే అంశాలపై కాంగ్రెస్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో డీఎమ్‌కే, ఎస్‌పీ, జేడీయూ, బీఆర్‌ఎస్, సీపీఎమ్ సహా మొత్తం 17 పార్టీలు కాంగ్రెస్‌కు అండగా నిలిచాయి. అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ నేతలూ హాజరవడం. మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది TMC.ప్రతిపక్షాల వ్యూహాలపై జరిగిన కీలక సమావేశంలో తృణమూల్‌ నేతలు హాజరవడం ఆసక్తికరంగా మారింది. ఎవరి ఐడియాలజీ వారిదే అయినప్పటికీ...ఈ సమయంలో అన్ని పార్టీలు ఏకం అవడం చాలా ముఖ్యం అని, బీజేపీపై పోరాడడానికి ఇదే మంచి తరుణం అని చెబుతోంది కాంగ్రెస్. బీజేపీపై పూర్తి స్థాయి పోరాటం మొదలు పెట్టిన కాంగ్రెస్‌పై TMCకి కాస్త నమ్మకం ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. దీనిపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునే ఏ పార్టీకైనా ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేశారు. 


Also Read: Covid 19 Cases: వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, ఆర్నెల్ల రికార్డు బ్రేక్